సగం ఖాళీ

20 Jan, 2016 01:52 IST|Sakshi

మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత
పట్టణాలుగా మారినా ఫలితం లేదు
ఉన్నవారితోనే నెట్టుకొస్తున్న పురపాలికలు
సేవలు అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలు

 
హన్మకొండ : సిబ్బంది కొరతతో మున్సిపాలిటీల్లో పాలన మందగించింది. పారిశుద్ధ్యం, టౌన్‌ప్లానింగ్ వంటి కీలక విభాగాల్లో ఇన్‌చార్జుల పాలన కొనసాగుతోంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌ను మినహాయిస్తే జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలు, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి  నగర పంచాయతీలలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. ఆ పురపాలికలు సగం సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాయి. భూపాలపల్లి, పరకాల, నర్సంపేటలు మేజర్ గ్రామపంచాయతీల నుంచి నగర పంచాయతీలుగా 2011లో అప్‌గ్రేడ్ అయినా ఉద్యోగుల సంఖ్య పెరగలేదు. దీంతో పట్టణ ప్రజలకు మెరుగైన సేవ లు అందడం లేదు.

భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులు ఉండగా 31 మంది ఉద్యోగులు ఉండాలి. కానీ, కేవలం 9 మందే  విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది మంది ఉద్యోగులు ఇక్కడ పోస్టింగ్ రాగానే ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్‌పై వెళ్లిపోతున్నారు. గతేడాది భూపాలపల్లిలో పోస్టింగ్ తీసుకున్న మేనేజర్ కొద్ది రోజుల్లోనే మెదక్ జిల్లా దుబ్బాకకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. దీంతో పరిపాలనకు సంబంధించిన పనులు పెండింగ్‌లో ఉంటున్నాయి. అకౌంట్స్ విభాగంలో ముగ్గురు ఉద్యోగులు ఉండాలనే నిబంధనలుండగా ఒక్కరూ లేకుండా పోయారు. ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరకాల ఏఈ ఇక్కడ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లి, పరకాలకు ఒక్కరే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంలో తాగునీటి నిర్వహణ  గాడిన పడటం లేదు.

పరకాల నగర పంచాయతీలో  30 పోస్టులు మం జూరు కాగా కేవలం ఆరుగురే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సరిపడా సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపైనే పనిభారం పడుతోంది. టౌన్ ప్లానింగ్‌లో ఉద్యోగుల పోస్టులు భర్తీ కాకపోవడంతో భవన నిర్మాణ అనుమతుల విషయంలో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. భవనాల నిర్మాణ అనుమతి కోరుతూ వందల సంఖ్యలో  దరఖాస్తులు వచ్చాయి. పర్యవేక్షణ అధికారులు లేక పో వడంతో పట్టణంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణా లు వెలుస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొంద రు ప్రజాప్రతినిధులు బినామీలను నియమించుకుని నోటీసులు జారీ చేస్తామని బెదిరిస్తూ అక్రమ భవన నిర్మాణ యజమానుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు.

 నర్సంపేట నగర పంచాయుతీలో 63 వుంది ఉద్యోగులకుగాను కేవలం 27వుంది ఉన్నారు. వివిధపను ల కోసం కార్యాలయం వచ్చే వారు చిన్న పనికి కూ డా రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. మున్సిపల్ సిబ్బంది మధ్య గ్రూపు రాజకీయాలు పెరిగిపోయా యి. నిత్యం ఒకవర్గంపై మరోవర్గం ఫిర్యాదులు చే సుకుంటూ ప్రజాసేవలను పక్కకు పెడుతున్నారు.
 
అక్కడా అంతే..
1953లోనే మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన జనగామ మున్సిపాలిటీలోనూ సిబ్బంది కొరత ఉంది. ప్రస్తుతం గేడ్-్ర2 మున్సిపాలిటీగా ఉన్న జనగామలో మొత్తం 132 పోస్టులకు గాను 70 మంది పనిచేస్తున్నారు. మిగిలిన 62 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా పరిపాలన విభాగంలో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పట్టణ అభివృద్ధికి సంబంధించి వేగంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా మారింది. ఇంజనీరింగ్ విభాగంలో 22 పోస్టులకు గాను 14 మంది పనిచేస్తున్నారు. ఈ విభాగం ఆధ్వర్యంలో సరైన ప్రణాళికా లేకుండా నిర్మించిన డ్రెరుునేజీలతో కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. వర్షకాలంలో మురుగునీరు, వరద నీటితో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు మునుగుతున్నాయి. పబ్లిక్ హెల్త్ వర్కర్లు 57 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 27 మంది ఉన్నారు.  
  2011లో మహబూబాబాద్ మేజర్ గ్రామపంచాయతీ నుంచి ఏకంగా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహబూబాబాద్ మున్సిపాలిటీ జనాభా 52 వేలు. కానీ, అనధికారికంగా సుమారు 70 వేల జనాభా ఉంటుంది. జనాభాకు తగ్గ సిబ్బంది లేరు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ పోస్టు దాదాపు ఏడాదిగా ఖాళీగా ఉంది. దీంతో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఐదు పోస్టులకు గాను ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతులు కష్టంగా మారాయి. మరికొందరు ఎటువంటి అనుమతి లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. పురపాలక సంఘం పాలకమండలి సమావేశంలో సైతం అక్రమ నిర్మాణాలపై చర్చ జరిగింది. తాగునీటి సమస్య దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. పర్మినెంట్ రెవెన్యూ సిబ్బంది, బిల్ కలెక్టర్లు లేకపోవడంతో ఆస్తిపన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి.

పేరుకే గ్రేటర్
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 160 పోస్టులకు గాను 124 మంది సిబ్బంది ఉన్నారు. 36 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల 42 విలీన గ్రామాలు  కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. దీంతో దాదాపు 3 లక్షల జనాభా పెరిగింది. ఇందుకు తగ్గట్లుగా పోస్టుల సంఖ్య పెరగాల్సి ఉంది. పరిపాలన విభాగంలో సి బ్బంది కొరత లేకపోవడంతో పాలన వ్యవహారాలకు చాలా వరకు సాఫీగానే సాగుతున్నాయి. కానీ టౌన్‌ప్లానింగ్, అకౌంట్స్, ప్రజారోగ్య విభాగాల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. టౌన్‌ప్లానింగ్ విభాగంలో సిబ్బంది లేకపోవడంతో లేఅవుట్లలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలపై స్పష్టత కరువైంది. రికార్డుల ప్రకా రం 600 ఖాళీ స్థలాలు ఉండగా ప్రస్తుతం 180 స్థలాలనే గుర్తించారు. మిగిలిన స్థలాలు సర్వే చేసేందుకు సరిపడా సిబ్బంది లేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. ఇందుకు అనుగుణంగా వేగంగా పనులు జరిగేందుకు వీలుగా కొత్త పోస్టులు మంజూరు చేయడంతో పాటు పాత పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
 

మరిన్ని వార్తలు