సంపూర్ణ అక్షరాస్యతకు సహకరించాలి

9 Sep, 2014 01:51 IST|Sakshi

ఖమ్మం : జిల్లాలో ప్రతీ ఒక్కరు అక్షరాస్యులు కావాలని, జిల్లాను నిరక్షరాస్యులు లేని జిల్లాగా తీర్చిదిద్దే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఖమ్మం అడిషనల్ జాయింట్ కలెక్టర్ బాబూరావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఖమ్మంనగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఖమ్మం అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏజేసీ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.

జిల్లాలో మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో నిరక్షరాస్యత అధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు, విద్యార్థులు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు ముందుకు రావాలని అన్నారు. ప్రధానంగా మహిళల అక్షరాస్యతను పెంచితే కుటుంబంలో అందరూ అక్షరాస్యులుగా మారే అవకాశం ఉందని అన్నారు. జిల్లా వయోజన విద్య ఉపసంచాలకులు ఎంఏ. రత్నకుమార్ మాట్లాడుతూ అన్నిదానాల కంటే విద్యాదానం గొప్పదని అన్నారు.

ప్రతీ ఒక్కరు తమకున్న జ్ఞాన్నాన్ని ఇతరులకు పంచాలని అన్నారు. జిల్లాలో ఐదు దశలుగా జరిగిన అక్షరాస్యతా కార్యక్రమాల ద్వారా 67,300 మంది నిరక్షరాస్యులైన  వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని అన్నారు. నిరక్షరాస్యత నిర్మూలనకు వయోజన విద్యా వలెంటీర్లు, ఇతర ఉద్యోగులతోపాటు సమాజంలోని చదువుకున్న ప్రతీ ఒక్కరు సహకరిచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మాపీడీ వేణుమానోహర్‌రావు, సెట్‌కం సీఈఓ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్య అన్నింటికి మూలం అన్నారు. అందుకోసం ప్రతీ ఒక్కరు చదువుకోవాలని, అందుకు వయస్సుతో సంబంధం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సమతా మహిళా సొసైటీ నిర్వాహకులు సామ్యూల్ శైలజ, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు కనకయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు