‘హెరిటేజ్’ను మూసివేయాలి

17 Nov, 2014 23:51 IST|Sakshi

 జోగిపేట: హెరిటేజ్ పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేస్తూ జోగిపేటలో టీజీవీపీ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ నాయకులు విద్యార్థులతో ఊరేగింపుగా వచ్చి హెరిటేజ్ పరిశ్రమను మూసివేయాలంటూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 అంతకు ముందు వారు స్థానిక తహశీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి, అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు.  ఈ సందర్బంగా నియోజకవర్గ టీజీబీవీ నాయకులు కృష్ణాగౌడ్, సురేష్ మాట్లాడుతూ హెరిటేజ్ పాల కారణంగా చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నందున ప్రభుత్వం వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు.

 తెలంగాణ రాష్ట్రంలో హెరిటేజ్ పాలను నిషేధించాలి
 సంగారెడ్డి క్రైం: తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కొత్తబస్టాండ్ ఎదుట ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ పాలలో డిటర్టెంట్ కలిపి కల్తీ చేస్తున్నందున ఆ పాలను తెలంగాణ రాష్ట్రంలో నిషేధించాలన్నారు.  

కల్తీ పాల విక్రయాలకు మద్దతు పలుకుతున్న తెలంగాణ టీడీపీ నేతలు తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. హెరిటేజ్ పాలు విక్రయించి ఎక్కువ లాభాలు పొందాలనే దురాలోచనతో ఆవులకు, గేదెలకు ఇంజెక్షన్లు ఇవ్వడంతో  పసిపిల్లలు, విద్యార్థులు కిడ్నీ, కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ పాలను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల వేణు, మండల అధ్యక్షుడు శివరామకృష్ణ, మచ్చేందర్, రాజు, శ్రీనివాస్, నర్సిములు, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు