ఫోర్జరీ సంతకంతో బంగారం డ్రా

12 Jun, 2014 03:05 IST|Sakshi

దేవరకొండ : దేవరకొండ కో-ఆపరేటివ్ బ్యాంకులో నకిలీ పాస్‌పుస్తకాలతో కోట్ల రూపాయలు డ్రా చేసిన విషయం వెలుగు చూసిన నేపథ్యంలోనే ఫోర్జరీ సంతకంతో బంగారం డ్రా చేసిన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దేవరకొండకు చెందిన ఎం.ప్రేమలత 2012 సెప్టెంబరు 18న 15 తులాల బంగారు ఆభరణాలను దేవరకొండ కో-ఆపరేటివ్ బ్యాంకులో తనఖా పెట్టి 2లక్షల40వేల రూపాయలను లోనుగా తీసుకుంది. అయితే ప్రేమలత తన భర్త అశ్విన్‌కుమార్‌తో విబేధాలు రావడంతో ఏడాదిగా విడిగా ఉంటుంది. విడాకుల కోసం కోర్టులో కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల బ్యాం కులో బంగారు నగల విషయం వాకబు చేయగా 27డిసెంబరు 2013న డబ్బులు చెల్లించి బంగారాన్ని డ్రాచేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.
 
 దీంతో తన బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మును తన ప్రమేయం గానీ, తన సంతకం గానీ లేకుండా ఎలా డ్రా చేశారని బ్యాంకు అధికారులను ప్రశ్నించింది. ఆమె సంత కం స్థానంలో మరొకరు ఫోర్జరీ సంతకం చేశారని, దీనిపై విచారణ నిర్వహిస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో ప్రేమలత అకౌంట్‌లో తన ఫొటో ఉండగా బ్యాంకు అధికారుల ప్రమేయం లేనిదే నగలను ఎలా డ్రా చేశారంటూ ప్రశ్నించడంతో పాటు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రేమలత బ్యాంకు అధికారులపై, సంతకం ఫోర్జరీ చేసినట్లు అనుమానిస్తున్న తన భర్త అశ్విన్‌కుమార్‌పై దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 
 తన నగలను తనకు ఇప్పించాలని వేడుకుంటుంది. ఇప్పటికే భర్తకు దూరంగా ఉంటూ ఇద్దరు ఆడపిల్లలతో ఎలా బతకాలంటూ బోరున విలిపించింది. ఈ విషయమై దేవరకొండ కో ఆపరేటివ్ బ్యాంకు మేనేజరు రవిని వివరణ కోరగా ఆమె అకౌంట్ నుంచి బంగారు ఆభరణాలు డ్రా చేసిన విషయం వాస్తవమేనని, అయితే లావాదేవీలు అధికంగా ఉన్నందున ఎవరు డ్రా చేశారనే విషయంపై విచారణ చేపడతామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు అన్యాయం జరగదని పేర్కొన్నారు. ఇదే విషయమై ఎస్‌ఐ శేఖర్‌ను వివరణ కోరగా కేసు విషయమై పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
 

మరిన్ని వార్తలు