‘గూడెం’లో సీఎండీ శ్రీధర్

9 Jan, 2015 05:07 IST|Sakshi
‘గూడెం’లో సీఎండీ శ్రీధర్

రుద్రంపూర్(ఖమ్మం) :సింగరేణి సీఎండీగా బాధ్యతలు చేపట్టిన ఎన్.శ్రీధర్ గురువారం మొదటి సారిగా కొత్తగూడెం ఏరియాలో పర్యటించారు. ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గౌతంఖని ఓపెన్‌కాస్టు, పీవీకే ఎయిర్‌షాఫ్ట్ మైన్లను సందర్శించారు. జీకే ఓసీ వ్యూ పాయింట్ నుంచి ఓబీ బ్లాస్టింగ్, బొగ్గు బ్లాస్టింగ్, బొగ్గు రవాణా ప్రక్రియను పరిశీలించారు. ఏరియా సీజీఎం మాదాసి మల్లేష్, జీకే ఓసీ పీఓ శాలెం రాజు ఓసీ పనితీరు, చరిత్రను సీఎండీకి వివరించారు.

అనంతరం ఓసీకి చెందిన ఓవర్‌బర్డెన్ వద్ద సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన జామాయిల్ ప్లాంటేషన్, క్వారీలోని ఓబీ డంపింగ్, లోడింగ్ పనులను చూశారు. బొగ్గు వెలికితీసే విధానాన్ని, బొగ్గు పొరల మందాన్ని, వాటి గ్రేడ్‌లను పీఓను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆర్‌సీహెచ్‌పీ వద్ద వ్యాగెన్‌లో బొగ్గు లోడింగ్, రోజుకు ఎన్ని వ్యాగన్లు రవాణా చేస్తున్నారు తదితర విషయాలను ఆర్‌సీహెచ్‌పీ డీవైఎస్‌ఈ ముత్యాల నాయుడు తెలిపారు.

ఇటీవల రూ.6కోట్ల వ్యయంతో చేపట్టిన ఎయిర్‌షాఫ్ట్ వైండింగ్ ఇంజిన్‌ను సీఎండీ పరిశీలించగా గని లోపల బొగ్గు వివరాలు, ఉత్పత్తి ప్రక్రియను గని ఏజెంట్ వివరించారు. వైండింగ్ ఇంజిన్ ఆపరేటింగ్, దాని ఉపయోగాలను సీజీఎంను అడిగి తెలుసుకున్నారు. సీఎండీ వెంట డెరైక్టర్లు బి.రమేష్ కుమార్(ఆపరేషన్స్), మనోహర్‌బాబు(పీఅండ్‌పీ), గనుల మేనేజర్లు ఆర్.నారాయణరావు, బచ్చ రవీందర్, ప్రభాకర్‌రావు, సెక్యూరిటీ అధికారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు