కార్మికులకు ఊరట

20 Nov, 2018 17:49 IST|Sakshi

 కారుణ్యంలో  హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతున్న కార్మిక సంఘాలు  

 రెండేళ్ల సర్వీస్‌ నిబంధనను కోర్టు రద్దు చేసినా యాజమాన్యం పట్టించుకోవడంలేదని ఆరోపణ  

 అమలు చేస్తే సంస్థవ్యాప్తంగా సుమారు 500 మంది కార్మికులకు లబ్ధి

సింగరేణి(కొత్తగూడెం) : హైకోర్టు తీర్పు సింగరేణి కార్మికులకు ఊరట కలిగించింది. మెడికల్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకునే కార్మికులకు యాజమాన్యం విధించిన రెండు సంవత్సరాల నిబంధన రద్దు చేయాలని, ఎలాంటి కొర్రీలు పెట్టకుండా అనారోగ్యంతో ఉన్న కార్మికులందరినీ ఇన్వాలిడేషన్‌ చేయాలని ఈ నెల 5న ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఆ తీర్పును వెంటనే అమలు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నాయి. అయితే తమకు ఎలాంటి సమాచారం లేదని సింగరేణి అధికారులు చెబుతున్నారు.  

ఆ నిబంధన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం..
ఈ నెల 5న ఇచ్చిన తీర్పులో అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుడికి జబ్బు ఉందా లేదా అని నిర్ధారణ చేసుకున్న యాజమాన్యం వెంటనే ఇన్‌వాలిడేషన్‌ చేయకుండా, అతనికి రెండు సంవత్సరాల సర్వీసు ఉందా? ఉన్న జబ్బు ఎంత శాతం ఉంది? అనే నిబంధనలు విధించటం కార్మికులను వేధింపులకు గురిచేయటమే  అవుతుందని,  కానీ కార్మిక కుటుంబాలకు సహాయ కారిణి కాదని, ఇది రాజ్యాంగా స్ఫూర్తికి విరుద్ధమని, ఈ నిబంధనను పూర్తిగా కొట్టివేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.  

రెండేళ్ల నిబంధనతో అన్యాయం 
ఎనిమిది నెలలక్రితం సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నియామకాల స్థానంలో మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌తో కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది. కారుణ్యం తమకు ఆసరా అవుతుందని కార్మిక కుటుంబాలు ఆశపడ్డాయి. కానీ రెండేళ్ల సర్వీస్‌ నిబంధన విధించడంతో చాలా మంది కార్మికులు మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత కోల్పోయారు. రెండేళ్లకు వారం, పదిరోజులు, పక్షంరోజులు తక్కువగా ఉన్నా, వారు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పటికీ యాజమాన్యం మెడికల్‌ బోర్డుకు పిలవడంలేదు. ఈ క్రమంలో తమకు అన్యాయం జరుగుతోందని కొందరు కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలో పుర్వపరాలు పరిశీలించిన పిదప యాజమాన్యంను తప్పుపడుతూ  తీర్పు నిచ్చినిన్తూ రెండేళ్ల సర్వీసు నిబంధన సరైందికాదని, వెంటనే ఈ నిబంధనను ఉపక్రమించి కార్మికులకు న్యాయం చేయాలని ఆదేశించింది. 

మరిన్ని వార్తలు