* భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ
* నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
* నేరుగా మార్చి 3వ తేదీ వరకు అవకాశం
గోదావరిఖని(కరీంనగర్) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణిలో కొత్త కొలువులకు తెరలేచింది. ఈ మేరకు మొదటి దఫాలో 1,171 మందిని ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా పోస్టులకు సంబంధించి అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు బుధవారం(నేడు) నుంచి ఈనెల 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ ప్రకటించింది.
అలాగే ఆన్లైన్లో దరఖాస్తు చేసిన పత్రాన్ని ప్రింట్ చేయించి మార్చి 3వ తేదీలోగా కొత్తగూడెంలోని నిర్ధేశిత చిరునామాకు నేరుగా పంపించాలని అధికారులు పేర్కొన్నారు. సింగరేణిలో గత ఏడాదితో పాటు ప్రస్తుత సంవత్సరం, రాబోయే సంవత్సరంలో భారీగా సాంకేతిక నైపుణ్యం కలిగిన ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్న నేపథ్యంలో వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు యాజమాన్యం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తిగా రాతపరీక్ష ద్వారా మాత్రమే ఈ పోస్టులు భర్తీ చేయనుంది.