కోహెడ బాధితులకు ప్రభుత్వం అండ: నిరంజన్‌రెడ్డి

5 May, 2020 09:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోహెడ మార్కెట్‌కు వచ్చే ఉత్పత్తులకు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కల్పించటం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కోహెడ దుర్ఘటనపై స్పందించిన ఆయన మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వమని చెప్పారు. ఈ దుర్ఘటనలో 30 మందికి గాయాలు అయ్యాయని తెలిపారు.  ప్రమాదంలో గాయపడిన వారిని సమీప అమ్మ, సన్ రైస్, షాడో, టైటాన్ ఆసుపత్రులకు తరలించినట్లు ఆయన చెప్పారు. సీరియస్ ఉన్న ఒకరిని కామినేని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. చికిత్స అనంతరం 12 మందిని ఆసుపత్రి నుండి వైద్యులు డిశ్చార్జి  చేశారని, మిగిలిన 18 మంది చికిత్స ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు.

నాలుగు ఆసుపత్రుల్లో పర్యవేక్షణకు నలుగురు అధికారులను నియమించినట్లు ఆయన చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. కోహెడలో గంటకు 83.52 కిలోమీటర్ల వేగంతో గాలి విచినట్లు వాతావరణ శాఖ నివేదిక తెలిపిందన్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి రాజకీయాలు పక్కనపెట్టి ప్రతి ఒక్కరూ రైతులకు భరోసా ఇవ్వాలని నిరంజన్‌రెడ్డి అన్నారు. మార్కెట్ పునరుద్దరించే వరకు కొనుగోళ్ల కోసం రైతులకు, ట్రేడర్లకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇక సోమవారం కోహెడ మార్కెట్‌లో మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సాన్ని సృష్టించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు