సింగూరుకు జల గండం

19 Aug, 2019 10:31 IST|Sakshi
మిషన్‌భగీరథ పంప్‌హౌస్‌

ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి రాని నీరు

మూడు జిల్లాలకు నిలిచిన తాగునీటి సరఫరా 

వర్షపు నీటిపైనే ఆధారపడుతున్న వైనం

 సాక్షి, పుల్‌కల్‌/ మెదక్‌ :  రెండు సంవత్సరాల కిందటి వరకు సింగూర్‌ నీటిని జంట నగరాల తాగునీటి అవసరాలకు వినియోగించేవారు. కానీ 2018 నుంచి సింగూర్‌ నీటిని పూర్తిగా సాగు, తాగు నీటి అవసరాలకు వినియోగిస్తున్నారు.  ప్రాజెక్టులోకి ఎగువ ప్రాతం నుంచి చుక్క నీరు రావడం లేదు. ఫలితంగా నిజామాబాద్, కామారెడ్డితో పాటు ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధిలోని 960 గ్రామాలతో పాటు ఐదు మున్సిపాలిటీలు, రెండు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని డివిజన్‌లకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేయడం కోసం పుల్‌కల్‌ మండలం సింగూర్‌ ప్రాజెక్టు ఎడుమ, కుడి వైపులా పంప్‌ హౌస్‌ల నిర్మాణం చేశారు.  ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో గత మార్చి నుంచి అధికారులు నీటిని అదా చేస్తు వచ్చారు. జూన్, ఆగస్టు మాసం వరకు ప్రాజెక్టులోకి నీరు వస్తుందనే ధీమాతో ప్రతీ రోజు 100 మీలియన్‌ లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా 50 మిలియన్‌ లీటర్ల నీటిని మే మాసం వరకు సరఫరా చేస్తూ వచ్చారు. ప్రాజెక్టులో నీటి మట్టం పడిపోవడంతో పంపింగ్‌ను సైతం నిలిపివేశారు. దాదాపుగా మూడు నెలలు కావస్తున్నా 960 గ్రామాలకు పూర్తిగా తాగునీటి సరాఫరా నిలిచిపోయింది.

వర్షంపైనే ఆధారం.. 
ప్రస్తుత పరిస్థితిలో సింగూర్‌ ప్రాజెక్టులోకి నీరు వస్తే గాని తాగునీరు సరఫరా అయ్యేలా లేదు. ఇందుకు ప్రస్తుతం ప్రాజెక్టులో ఆర టీఎంసీ నీరు కూడా లేదు. 30 టీఎంసీల సామర్థ్యంగల ప్రాజెక్టులో కేవలం ఆర టీఎంసీ నీరు ఉంది. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ఇంత వరకు భారీ వర్షాలు లేని కారణంగా చుక్క నీరు కూడా రాలేదు. ఫలితంగా సింగూర్‌ ప్రాజెక్టు పూర్తిగా వర్షం వల్ల వచ్చే వరదపైనే అధారపడింది.  

నీరు వస్తుంది 
సింగూర్‌ ప్రాజెక్టులోకి ఈ సీజన్‌లో తప్పకుండా వరదలు వస్తాయి. ప్రతీ యేడు ఆగస్టు, సెప్టెంబర్‌లోనే అధికంగా వరదలు వచ్చి ప్రాజెక్టు నిండేది. ప్రాజెక్టులో 29.99 టీఎంసీలు నిల్వ చేసి దిగువకు మిగతా నీటిని వదలడం జరిగింది.  ఈ సారి అలాగే వస్తుందనే నమ్మకం ఉంది.  –బాలగణేష్, డిప్యూటీ ఇంజనీర్‌ సింగూరు

తాగునీటి సమస్యకు పరిష్కారం  
సింగూర్‌ ప్రాజెక్టులో నీటిì లభ్యత లేని కాకరణంగా మిషన్‌ భగీరథ పథకం ద్వారా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇందుకు గ్రామాలలో నెలకొన్నా నీటి సమస్యను అధికమించేందుకు వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకోవాలని సర్పంచ్‌లకు సూచించాం. నెలకు రూ.4 వేలు బోర్‌కు ఇవ్వడంతో పాటు రవాణా చార్జీలు సైతం చెల్లిస్తున్నాం.  –రఘువీర్,  ఎస్‌ఈ, వాటర్‌ గ్రిడ్‌  

మరిన్ని వార్తలు