సాక్షి, హైదరాబాద్ : హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడి శ్రీనివాస్రెడ్డిని సిట్ అధికారులు ఆదివారం విచారించనున్నారు. అతన్ని విచారించేందుకు నల్గొండ జిల్లా కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించిందని రాచకొండ కమిషనరేట్ అధికారులు తెలిపారు. గతంలోనూ శ్రీనివాస్రెడ్డిని సిట్ అధికారులు వారంరోజుల పాటు విచారించిన సంగతి తెలిసిందే. నిందితుని నేర చరిత్రపై అధికారులు మరోసారి ఆరా తీయనున్నారు. ఇప్పటికే శ్రీనివాస్రెడ్డి కుటుంబ సభ్యులను, స్నేహితులను విచారించారు. నిందితుడు పనిచేసిన ప్రదేశాల్లో ఏమైనా నేరాలకు పాల్పడి ఉంటాడనే కోణంలోనూ విచారణ కొనసాగనుంది. శ్రావణిని హత్య చేసి బావిలో పాతిపెట్టే సమయంలో శ్రీనివాస్రెడ్డికి ఎవరైనా సహకరించారా అనే అనుమానాలపై కూడా వివరాలను సేకరించనున్నట్టు సమాచారం.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
హాజీపూర్ సైకో కిల్లర్కు మూడు రోజుల కస్టడీ