కరోనా: తెలంగాణలో కొత్తగా 6 కేసులు

28 Apr, 2020 19:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మంగళవారం కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయినట్టు మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ ఆరు పాజిటివ్ కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని వెల్లడించారు. గత నాలుగు రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 25 మంది మృతి చెందినట్టు చెప్పారు. కరోనా నుంచి కోలుకుని ఇవాళ 42 మంది డిశ్చార్జ్‌ అయ్యారని అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 374 మంది కరోనా నుంచి కోలుకున్నారని ప్రకటించారు. ప్రస్తుతం 610 కరోనా పాజిటివ్‌ యాక్టివ్ కేసులున్నట్టు వెల్లడించారు.

మే 7 వరకు లాక్‌డౌన్‌ తప్పకుండా పాటించాలని మంత్రి ఈటల స్పష్టం చేశారు. తెలంగాణలో 22 జిల్లాలు గ్రీన్‌జోన్‌లో ఉన్నాయని చెప్పారు. కరోనా నిర్ధారిత పరీక్షలు సరిగా చేయడంలేదని ఆరోపణలు వస్తున్నాయని, ఉన్న లెక్కల ప్రకారమే సమాచారం ఇస్తున్నామన్నారు. ఎక్కడ తప్పుడు లెక్కలు చెప్పడం లేదని, విజ్ఞత గానే వచ్చిన కేసులు చూపెడుతున్నామని తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన వాళ్లు లక్షల మంది ఉంటారని.. వారంతా ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే డబ్బులు దండుకునే అవకాశం ఉంది కాబట్టే ప్రైవేట్ ల్యాబ్‌లకు అనుమతి ఇవ్వలేదని వివరించారు. తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై కేంద్రం హర్షం వ్యక్తం చేసిందని, కరోనా కట్టడి లో తెలంగాణ ముందుందని చెప్పారు. (తగ్గిన కంటైన్మెంట్‌ జోన్లు)

మరిన్ని వార్తలు