ఆరుగురు దొంగల అరెస్ట్

30 Aug, 2015 15:39 IST|Sakshi

నల్లగొండ: వ్యవసాయ బావుల వద్ద ఉన్న మోటర్లు, పంపుసెట్లు, ట్రాక్టర్ ట్రాలీలు, కల్టివేటర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6.50 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. మండల కేంద్రంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. మిర్యాలగూడ నుంచి హాలియాకు ట్రాలీ ఆటోలో తరలిస్తున్న మోటర్లు, పంపుసెట్లను గుర్తించారు. ఇవి ఎవరివని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో దొంగతనాల విషయం బయటకు వచ్చింది.

మిర్యాలగూడ మండలానికి చెందిన గద్దెల సురేష్ ఆరుగురు సభ్యులతో కలిసి ముఠాగా ఏర్పడి దామరచర్ల, త్రిపురారం, మిర్యాలగూడా మండల పరిధిలోని పలు గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తెలిపారు. పగటిపూట రెక్కి నిర్వహించి రాత్రి సమయాల్లో ఆటో సహాయంతో.. మోటర్లను తలించే వారని విచారణలో తేలింది. అపహరించిన మోటర్లను హాలియాలో విక్రయించడానికి వెళ్తున్న సమయంలో ఆదివారం త్రిపురారం పోలీసుల చేతికి చిక్కారు.

మరిన్ని వార్తలు