కలెక్టర్గా వెళ్తానంటున్న స్మిత?

15 Sep, 2014 12:00 IST|Sakshi
కలెక్టర్గా వెళ్తానంటున్న స్మిత?

తన పనితీరుతో అందరినీ ఆకట్టుకుని.. ముఖ్యమంత్రి పేషీలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న స్మితా సభర్వాల్.. మళ్లీ కలెక్టర్గానే వెళ్లిపోతానని అంటున్నట్లు తెలుస్తోంది. సీఎం పేషీలో ఉండే ఒత్తిళ్లను తట్టుకోవడం కష్టం అవుతోందని, దానికంటే కలెక్టర్గా ఉంటేనే మేలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. గతంలో కరీంనగర్, మెదక్ జిల్లాలకు కలెక్టర్గా పనిచేసిన స్మితా సభర్వాల్ను ఆమె పనితీరు చూసి.. కేసీఆర్ తన పేషీలోకి పిలిపించుకున్న విషయం తెలిసిందే.

అయితే, సాధారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలని అనుకుంటే.. అది వెంటనే కావాలంటారు. దానికి సబంధించిన ఫైళ్లు, సమాచారం ఆయనకు తక్షణం అందించాల్సి ఉంటుంది. కానీ, పలు కారణాల వల్ల అది ఆమెకు సాధ్యం కావట్లేదని అంటున్నారు. ఇంత ఒత్తిడి మధ్య సీఎం పేషీలో పని చేయడం కంటే, మళ్లీ కలెక్టర్గా వెళ్లిపోతేనే మంచిదని, అక్కడే తన పనితీరుకు మంచిమార్కులు సంపాదించవచ్చని స్మితా సభర్వాల్ భావిస్తున్నారని తెలుస్తోంది.

ఇక స్మితా సభర్వాల భర్త అకున్ సభర్వాల్ ప్రస్తుతం జాతీయ పోలీసు అకాడమీలో కేంద్ర కేడర్లో పనిచేస్తున్నారు. ఆయనను మళ్లీ రాష్ట్ర కేడర్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం. గతంలో ఇక్కడ పనిచేసినప్పుడు సమర్ధుడైన అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అందువల్ల ఆయన సేవలను ఇక్కడ వినియోగించుకుంటే బాగుంటుందని పలువురు సూచించడంతో ఈ మేరకు ప్రయత్నాలు మొదలయ్యాయట.

మరిన్ని వార్తలు