టెకీ ప్రాణం తీసిన అతివేగం

15 Oct, 2015 18:31 IST|Sakshi

గచ్చిబౌలి : సహచరులు వారించినా వినకుండా మితిమీరిన వేగంతో వెళుతుండగా కారు అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చనిపోయింది. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ యాదేందర్ తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని దివ్య శ్రీ ఎన్‌ఎస్‌ఎల్ ఎస్‌ఈజెడ్‌లోని ఐబీఎంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేసే నలుగురు యువతులు, టీం లీడర్ రవిచంద్రతో కలిసి ఐస్‌క్రీం తినేందుకు కారులో హైటెక్ సిటీకి వెళ్లారు.

గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు తిరిగి వస్తుండగా రవిచంద్ర కారును మితిమీరిన వేగంతో నడుపుతున్నాడు. కారులో ఉన్న వారు వారించినా వినలేదు. రాయదుర్గంలోని బయోడైవర్సిటీ జంక్షన్‌లో అదపు తప్పి కారు పల్టీకొట్టింది. దీంతో కూకట్‌పల్లికి చెందిన ఐ.విజిత(23) అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన నలుగురిని గచ్చిబౌలిలోని హిమగిరి ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు