సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సగం జీతం పేదలకే..

24 Jan, 2020 10:15 IST|Sakshi

విద్యార్థులకు ఉచితంగా విద్యాసామగ్రి అందజేత

ఆదర్శంగా నిలుస్తున్న అనిల్‌

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులే లక్ష్యంగా ముందుకు..

సాక్షి, తిరుమలగిరి (నాగార్జునసాగర్‌) : సొంతలాభం కొంత మానుకో పొరుగువారికి తోడ్పడవోయ్‌ అన్నాడు గురజాడ అప్పారావు. దీనిని అక్షరాల నిజం చేస్తున్నాడు తిరుమలగిరి మండలం శిల్గాపురం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కట్టెబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌. మంచి మనస్సు ఉంటే పొరుగువారికి సాయం అందించడం కష్టమేమి కాదని నిరూపిస్తున్నాడు. ఆయనది దిగువ మధ్య తరగతి కుటుంబం. తన తల్లిదండ్రులు కూలిపనులు చేస్తూ అనిల్‌ను ఉన్నత చదువులు చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని ఒమ్ముచేయకుండా పట్టుదలతో చదివిన అనిల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఫ్యాక్‌సెట్‌ సిస్టమ్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చేస్తున్నాడు.

తాను సంపాదించిన దానిలో కొంచమైనా తనను ప్రయోజకుడిని చేసిన పాఠశాలకు, గ్రామానికి, నేటికీ మౌలిక వసతులకు దూరంగా ఉన్న పాఠశాలలకు, నిరుపేద విద్యార్థులకు పంచాలనేది ఆయన సంకల్పం. ఆ సంకల్పమే నేడు వేల మంది విద్యార్థులకు సాయం చేసేలా చేసింది. కొన్ని సంవత్సరాల నుంచి వివిధ రకాలుగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటున్నాడు అనిల్‌.

చిన్ననాటి నుంచే తాపత్రయం..
సమాజం మనకు ఏమిచి్చందనే ఆలోచనతో కాకుండా మనం సమాజ వికాసానికి ఏం చేస్తున్నామనే ఆలోచనతో ముందుకు సాగుతున్నాడు. మనకున్న దానిలో కొంతైనా ఇతరులకు సాయం చేయాలని అనిల్‌ చిన్ననాటి నుంచే తాపత్రయపడుతుండేవాడు. దీనిలో భాగంగానే 2011 తన స్వగ్రామమైన శిల్గాపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన సొంత డబ్బులతో నోట్‌బుక్స్, బ్యాగులు, పెన్నులు, పెన్సిల్, టైబెల్ట్‌లతోపాటు వివిధ రకాల సామగ్రిని అందజేశాడు.

ఈ క్రమంలోనే మరికొంత మంది పేద విద్యార్థులకు సాయం చేయాలనే ఆలోచనతో తాను పనిచేసే ఫ్యాక్‌సెట్‌ కంపెనీని భాగస్వామ్యం చేసి తన గ్రామంతోపాటు కొంపల్లి, తిరుమలగిరి, ఎల్లాపురం, ఎల్లాపురంతండా, ఆంజనేయతండా, చల్మారెడ్డిగూడెం, అనుములచ శ్రీరాంపల్లి, ఊట్లపల్లి, పులిచర్ల, వెనిగండ్ల, ముప్పారం, గుడిపల్లి, నేరేడుచర్ల నాయనేనికుంట, బొత్తలపాలెం, తెప్పలమడుగు తదితర గ్రామాల్లోని పాఠశాలలకు బీ రువాలు, నోట్‌పుస్తకాలు, బెంచీలు తదితర వస్తువులతోపాటు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు, పాఠశాలల్లో దంత వైద్యపరీక్షలు చేయించి ఉచితంగా బ్రెష్‌లు, పేస్టులు అందజేశారు. 

విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం.. 
వీటితోపాటు పదో తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆయన ప్రతి ఏటా నగదు ప్రో త్సాహకాలు అందజేస్తున్నారు. తనకున్న అనుభవాలను, చదువులో ఎలాంటి మెళకువలు నేర్చుకొని జీవితంలో ముందుకు సాగాలనే అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ వారి భవితకు బాటలు వేస్తున్నారు.
నేను సంపాదించిన దాంట్లో సగం పేదలకు ఖర్చుచేయాలని నిర్ణయించుకున్నా.

అందులో భాగంగానే ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోట్‌బుక్, లైబ్రరీ, బెంచీలు తదితర సామగ్రిని అందజేశా. నాతోపాటు నేను పనిచేసే సంస్థను కూడా భాగస్వామ్యం చేసి, ఎక్కువ మంది విద్యార్థులకు సాయపడుతున్నాం. భవిష్యత్‌లో ఇంకా ఎక్కువ మందిని, సంస్థలను భాగస్వామ్యం చేసి నిరుపేద విద్యార్థులకు సాయ పడుతాం.  – కట్టెబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి 

మరిన్ని వార్తలు