పశువులపైనా వైరస్‌ పడగ

7 Jun, 2020 02:41 IST|Sakshi
వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి మండలంలో పాక్స్‌ వైరస్‌ సోకిన దూడ 

‘పాక్స్‌’ కుటుంబానికి చెందిన వైరస్‌ మన రాష్ట్ర ఆవుల్లో గుర్తింపు

గతేడాది ఒడిశాలో వెలుగులోకి.. తొలుత ఖమ్మం జిల్లాలోకి ప్రవేశం

కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డిల్లో కూడా

మార్చిలో గుర్తించిన పశుసంవర్థక శాఖ.. అన్ని జిల్లాల్లో రింగ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి

వైరస్‌తో ఆవుల చర్మంపై బొడిపెలు.. మనుషులకు ప్రమాదం లేదు: పశువైద్య వర్గాలు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రజానీకంపై ఒకపక్క కరోనా వైరస్‌ పంజా విసురుతోంటే, మరోపక్క మూగజీవాలపై పాక్స్‌ వైరస్‌ కుటుంబానికి చెందిన వైరస్‌ పడగ విప్పుతోంది. ఈ వైరస్‌తో సోకుతున్న ‘లంపీస్స్కిన్‌‌‌‌ వ్యాధి’కారణంగా ఆవులు, దూడల చర్మంపై బొడిపెలు వస్తున్నాయి. ఈ వైరస్‌ గతేడాది నవంబర్, డిసెంబర్‌ మాసాల్లో ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసి, ఈ ఏడాది మార్చి నాటికి మన రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించినట్టు పశువైద్య వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మంతో పాటు ప్రస్తుతం కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని ఆవులు, దూడల్లో దీన్ని గుర్తించామని, గేదెల్లో మాత్రం లక్షణాలు కనిపించలేదని అంటున్నాయి. ఈ వైరస్‌ తీవ్రత ఈసారి కొంచెం ఎక్కువే ఉందని, పశుసంవర్థక శాఖ అప్రమత్తంగానే ఉందని, ఇప్పటికే దీని నివారణకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని, పాడి రైతులు ఈ వైరస్‌ను గుర్తిస్తే ఆందోళన చెందకుండా తమను సంప్రదించాలని ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు. (సీఎం ఆఫీసులో కరోనా కలకలం)

అమ్మతల్లి తరహాలో.. 
మనుషులకు అమ్మతల్లి (మశూచి) సోకినట్టే ఆవులకూ ఈ వైరస్‌ సోకుతుందని తెలుస్తోంది. ఈ వైరస్‌ వల్ల వచ్చే వ్యాధి కారణంగా పశువుల ఒంటి నిండా పెద్దపెద్ద బొడిపెలు వస్తున్నాయి. ఒడిశా రాష్ట్రం నుంచి ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల మీదుగా అటవీ ప్రాంతాల నుంచి ఈ వైరస్‌ ఖమ్మం జిల్లాలోకి వచ్చిందని అధికారులు అంటున్నారు. వైరస్‌ను గుర్తించిన వెంటనే రింగ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి చేశామని చెబుతున్నారు. ఎక్కడైనా ఒక ఆవులో ఈ వైరస్‌ లక్షణాలు గుర్తిస్తే ఆ ఆవు ఉన్న గ్రామానికి 5 కిలోమీటర్ల చుట్టూ ఉన్న అన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ చేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అంటున్నారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒక్క కొత్తగూడెం జిల్లాలోనే 6వేలకు పైగా ఆవులకు ఈ వ్యాధి సోకగా 23 చనిపోయినట్టు సమాచారం. ఈ జిల్లాలోనే 17వేలకు పైగా ఆవులకు వ్యాక్సినేషన్‌ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ దీని ప్రభావం తీవ్రంగానే కనిపిస్తోంది. పెద్దగా భయపడాల్సిన పని లేదని అధికారులు అంటున్నా రైతులు ఈ వైరస్‌పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. (ఒక్కరోజే  206 కేసులు..)

ఆందోళన అవసరం లేదు 
వైరస్‌ పూర్తి నియంత్రణలో ఉంది. దీన్ని గుర్తించగానే మా శాఖ అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్‌ పూర్తిస్థాయిలో చేశాం. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ వ్యాధి లక్షణాలు గుర్తిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదిస్తే తగిన చికిత్స అందిస్తారు.– రాంచందర్, అడిషనల్‌ డైరెక్టర్, పశుసంవర్థక శాఖ 

మనుషులకు సోకే అవకాశం లేదు..
పశువుల్లో కనిపిస్తున్న ఈ వైరస్‌ కారణంగా మనుషులకు ఎలాంటి ఇబ్బంది లేదని పశువైద్య వర్గాలు తెలిపాయి. ఈ వైరస్‌కి జూనోటిక్‌ లక్షణం లేదని, మనుషులకు ఎట్టి పరిస్థితుల్లో సోకే అవకాశం లేదని అంటున్నారు. ఈ వైరస్‌ సోకిన పశువులకు కూడా సకాలంలో వైద్యం అందిస్తే ప్రాణహాని ఉండదని, మరణాల రేటు చాలా తక్కువని చెబుతున్నారు. గతంలో కూడా ఈ వైరస్‌ మన రాష్ట్రంలో కొన్నేళ్ల పాటు ఉందని, అయితే ఇప్పుడు కొంత తీవ్రంగా ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు