రామప్ప’ ఇక రమణీయం

12 Nov, 2019 05:10 IST|Sakshi
రామప్ప ఆలయం ఆడిటోరియం నమూనా

రూ.5 కోట్లతో ఆడిటోరియం

సీఎస్‌ఆర్‌ నిధులతో స్వాగత తోరణాలు

ఐ ల్యాండ్‌లో భారీ శివలింగం

10 ఎకరాల్లో శిల్ప కళావేదిక, కాలేజీ

త్వరలోనే యునెస్కో ద్వారా అంతర్జాతీయ గుర్తింపు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం త్వరలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, సాంçస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా మారనుంది. అంతర్జాతీయ నిర్మిత ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కార్యాచరణ వేగంగా అమలు జరుగుతోంది. కాకతీయుల కాలం నాటి అత్యంత రమణీయ శిల్పకళా వైభవానికి త్వరలోనే ప్రపంచ గుర్తింపు రానుంది. రూ.5 కోట్లతో అత్యంత ఆధునికమైన, నాటి శిల్పకళా వైభవాన్ని చాటే విధంగా ఆడిటోరియం, సీఎస్‌ఆర్‌ నిధులతో రెండు స్వాగత తోరణాలు.. ఒకటి ప్రధాన రహదారి వద్ద, మరొకటి రామప్ప గుడి ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నిర్మిస్తున్నారు. రామప్ప గుడి పక్కనే ఉన్న చెరువు మధ్యలో ఉన్న ఐ ల్యాండ్‌లో భారీ శివలింగం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు నమూనాలను కూడా సిద్ధం చేశారు. అలాగే రామప్పలో 10 ఎకరాల స్థలంలో ఒక శిల్ప కళావేదిక, శిల్పుల కోసం, శిల్ప కళా అధ్యయనం కోసం ఒక కాలేజీ ఏర్పాటు చేయనున్నారు. కాగా యునెస్కోకి నామినేషన్‌ ప్రక్రియ కూడా పూర్తి కాగా, సెప్టెంబర్‌ 26, 27వ తేదీల్లో యునెస్కో బృందం రామప్పలో పర్యటించింది. యునెస్కో నుంచి వచ్చిన మన ప్రతినిధి బృందానికి పిలుపు రాగా, ఈ నెల 22న పారిస్‌ లో యునెస్కో బృందంతో సమావేశం జరగనుంది. కాగా, రామప్ప ఆలయం అభివృద్ధిపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి.. ములుగు జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్, కలెక్టర్‌ నారాయణరెడ్డి తదితరులతో సోమవారం సమీక్ష జరిపారు.

మరిన్ని వార్తలు