ధ్వని..దడ

14 Aug, 2018 09:17 IST|Sakshi

సున్నిత ప్రాంతాల్లోనూ ‘సౌండ్‌’  

నియంత్రణలో ప్రభుత్వవిభాగాలు విఫలం  

నివారణ చర్యలను వివరించాలని మున్సిపల్, ట్రాన్స్‌పోర్ట్, ట్రాఫిక్‌

విభాగాలకు హైకోర్టు నోటీసులు

సాక్షి, సిటీబ్యూరో: రణగొణ ధ్వనులతో మహానగరంలో మోత మోగుతోంది. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, నివాసాలు తదితర సున్నిత ప్రాంతాల్లోనూ విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో శబ్ద కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించాలని కోరుతూ... మున్సిపల్, రవాణా, ట్రాఫిక్‌ విభాగాలకు హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ విపిన్‌ శ్రీవాత్సవ రాసిన లేఖను ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్‌ నేతృత్వం లోని ధర్మాసనం ఇటీవల సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధానంగా ఆస్పత్రులు, విద్యాసంస్థలు, నివాస ప్రాంతాలను(శబ్దకాలుష్య రహిత ప్రాంతాలు– నో హాంకింగ్‌ జోన్స్‌)గా ప్రకటించాలని ఆయన తన లేఖలో కోరారు.

ట్రాఫిక్, రవాణా, పోలీస్‌ శాఖలు ఆయా ప్రాంతాల వారీగా శబ్ద కాలుష్య అవధిని నిర్ణయించాలని... అంతకుమించి ధ్వనిని వెలువరించే సంస్థలు, వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని విన్నవించారు. నగరంలో ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరచాలని, పెరుగుతోన్న వ్యక్తిగత వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు, రహదారి భద్రతా నియమాలు, చోదక సామర్థ్యం లేని వారికి డ్రైవింగ్‌ లైసెన్సులు జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు నివారణ చర్యలను వివరించాలని అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లో శబ్ద కాలుష్యానికి కారణాలు, ప్రస్తుత పరిస్థితిపై ‘సాక్షి’ కథనం.  

పరిమితికి మించిన ధ్వనులతో గ్రేటర్‌ గూబ గుయ్‌మంటోంది. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, నివాసాలున్న సున్నిత ప్రాంతాల్లోనూ మోత మోగుతోంది. నగరంలోని కొన్ని సున్నిత, వాణిజ్య ప్రాంతాల్లో పీసీబీ నిర్దేశించిన ప్రమాణాల కంటే అధికంగా ధ్వని కాలుష్యమవుతోంది. అబిడ్స్, పంజగుట్ట (వాణిజ్య ప్రాంతాలు), జీడిమెట్ల (పారిశ్రామిక ప్రాంతం), జూపార్క్‌ (నిశ్శబ్ద జోన్‌), గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌ (నివాస ప్రాంతం)లో మాత్రమే పీసీబీ ధ్వని కాలుష్యాన్ని నమోదు చేస్తోంది. అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లు, మరో 100 ముఖ్య కూడళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు అధికంగా ఉన్న మార్గాల్లో శబ్ద కాలుష్య అవధిని నిర్ణయించడంలో పీసీబీ, మున్సిపల్, రవాణా, ట్రాఫిక్‌ విభాగాలు విఫలమవుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రణగొణ ధ్వనులతో సిటీజనులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 

ఇవీ కారణాలు...  
నగరంలో శబ్ద కాలుష్యానికి రవాణా వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణరంగ కార్యకలాపాలు, జనరేటర్ల వినియోగం, ఫైర్‌క్రాకర్స్‌ కాల్చడం, లౌడ్‌ స్పీకర్లు, డీజే హోరు తదితర ప్రధాన కారణాలు.  
భారీ ట్రక్కులు, వాహనాల డ్రైవర్లు నిరంతరాయంగా హారన్ల మోత మోగిస్తుండడం.   
గ్రేటర్‌లో మొత్తం వాహనాల సంఖ్య 50 లక్షలు. వీటిలో 15ఏళ్లకు మించి కాలం చెల్లిన వాహనాలు 15లక్షలకు పైమాటే. వీటి ఇంజిన్ల నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వెలువడుతున్నాయి.
ఇక యూత్‌ ప్రత్యేక గుర్తింపు కోసం అధిక శబ్దాలు వెలువడే మోడిఫైడ్‌ హారన్లను వినియోగిస్తుండడంతో శబ్ద కాలుష్యం పెరుగుతోంది.
గ్రేటర్‌లో సుమారు 100 ప్రధాన ట్రాఫిక్‌ జంక్షన్లున్నాయి. వీటి దగ్గర అధిక సమయం వాహనాలు నిలపాల్సి రావడంతో హారన్ల మోత మోగుతోంది.
నివాస ప్రాంతాలకు ఆనుకొని ఫంక్షన్‌ హాళ్లు, క్లబ్బులు, పబ్బులు ఏర్పాటు చేస్తుండడంతో... అక్కడి డీజేల హోరు స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తోంది.  
గ్రేటర్‌లో నిర్మాణరంగం శరవేగంగా విస్తరిస్తుండడంతో బోరుబావుల తవ్వకం, లోడర్లు, డంపర్లు లాంటి కాంక్రీట్‌ మిక్సింగ్‌ యంత్రాల వినియోగం పెరిగింది. వీటి నుంచి అధిక శబ్దాలు వెలువడుతున్నాయి.  

శబ్ద గ్రాహకాల ఏర్పాటులో నిర్లక్ష్యం...  
గ్రేటర్‌ పరిధిలో సుమారు వెయ్యి ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులున్నాయి. ఇవన్నీ ప్రధాన రహదారులు, ముఖ్యమైన కాలనీల్లోనే ఉన్నాయి. వీటిలో సగం ఆస్పత్రులకు శబ్ద గ్రాహకాలు లేకపోవడంతో రోగులు అధిక ధ్వనులు విని ఆందోళనకు గురవుతున్నారు.  
నగరంలో సుమారు 5వేల ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. ఇవి కూడా దాదాపు ప్రధాన రహదారులు, ముఖ్య వీధులు, కాలనీల్లోనే ఉన్నాయి. వీటిల్లోనూ శబ్ద గ్రాహకాలున్న పాఠశాలలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు.  

నష్టాలివీ...  
నవజాత శిశువులు 90 డెసిబుల్స్‌ దాటిన శబా ్దలు వింటే వినికిడి శక్తి కోల్పోతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.  
పెంపుడు జంతువులు 50 డెసిబుల్స్‌ దాటిన శబ్దాలను వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు వాటి కర్ణభేరీ బద్దలయ్యే ప్రమాదం ఉంటుంది.  
అతిధ్వనులు విన్న జంతువులు ఇంటి నుంచి పరుగెత్తి రోడ్డు ప్రమాదాల బారిన పడడం, కరవడం లాంటివి చేస్తాయి.   
90 డెసిబుళ్లకు మించిన శబ్దాలు విన్నపుడు కొందరికి తాత్కాలిక చెవుడు, మరికొందరికి దీర్ఘకాలిక చెవుడు వచ్చే ప్రమాదం ఉంది.  
చిన్నపిల్లల కర్ణభేరీలోని సూక్ష్మనాడులు దెబ్బతింటాయి. వద్ధులకూ శాశ్వత చెవుడు వచ్చే ప్రమాదం ఉంది.  
అత్యధిక ధ్వనులు విన్నపుడు చిన్నపిల్లల మెదడుపై దుష్ప్రభావం పడుతుంది. వారిలో చురుకుదనం లోపించి బుద్ధిమాంద్యం సంభవిస్తుంది. చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది.

నివారణ చర్యలివీ...  
ప్రధానంగా పాఠశాలలు, ఆస్పత్రుల గోడలను అధిక శబ్దాలను నిరోధించే జిప్సం బోర్డులు, ఫైబర్‌ గ్లాస్‌ ఇన్సులేషన్స్‌తో కప్పి వేస్తే ధ్వని లోపలికి చేరకుండా ఉంటుంది.  
అధిక శబ్దాలు వెలువడే ప్రాంతాల్లోని భవనాలకు విధిగా శబ్దగ్రాహకాలు ఏర్పాటు చేయాలి.
ప్రతి ఆస్పత్రి, పాఠశాల ఆవరణలో గ్రీన్‌బెల్ట్‌ను అధికంగా ఏర్పాటు చేయాలి. అధిక శబ్దాలను గ్రహించేందుకు హరిత వాతావరణం దోహదం చేస్తుందని గుర్తించాలి. గ్రీన్‌బిల్డింగ్‌ల నిర్మాణాలను ప్రోత్సహించాలి.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ఏ వ్యక్తి అయినా 8గంటల పాటు 85 డెసిబుల్స్‌కు మించిన శబ్దం వినకుండా జాగ్రత్తలు పాటించాలి.  
అత్యధిక శబ్దాలు వినిపించే ప్రాంతాల్లో ఇయర్‌ప్లగ్‌లు వాడాలి.
ట్రాఫిక్‌ రద్దీలో బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్‌లు, చెవుల్లో దూది పెట్టుకోవాలి.

దీర్ఘకాలంలో వినికిడి లోపం...  
వినికిడి అవధిని దాటి అధికంగా వెలువడే శబ్దాలను ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. శబ్ద కాలుష్యం అవధిని మించి నమోదయితే అక్కడి నివాసితులకు చెవిలో రింగురింగుమంటూ శబ్దాలు వినిపిస్తాయి. దీర్ఘకాలం ఈ శబ్దాలను వినే వారికి శాశ్వత వినికిడి లోపం వస్తుంది. నిద్రలేమి, అలసట, హృæదయ రక్తనాళాల సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. రక్తపోటు పెరుగుదల అధికంగా ఉంటుంది. చేసే పని మీద ఆసక్తిని కోల్పోతారు.  – డాక్టర్‌ రవిశంకర్, ఈఎన్‌టీ వైద్యనిపుణులు, కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి 

మరిన్ని వార్తలు