సారొస్తున్నారు..!

20 Dec, 2018 11:05 IST|Sakshi
మహబూబ్‌నగర్‌లో ప్రారంభానికి సిద్ధమైన ఉద్యోగుల క్వార్టర్లు, (ఇన్‌సెట్‌లో)దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌(జీఎం) వినోద్‌కుమార్‌ యాదవ్‌

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌(జీఎం) వినోద్‌కుమార్‌ యాదవ్‌ గురువారం మహబూబ్‌నగర్‌ రానున్నారు. ఈ మేరకు ఆయన ఉమ్మడి జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లలో పరిశీలిస్తారు. వార్షిక పర్యటనలో భాగంగా జనరల్‌ మేనేజర్‌ జిల్లాకు వస్తుండగా.. ఆయన పరిశీలించనున్న స్టేషన్లను అధికారులు ఏర్పాటుచేశారు. కాగా, వివిధ స్టేషన్లలో పలు కార్యాలయాలను జీఎం ప్రారంభిస్తారు. 

జనరల్‌ మేనేజర్‌ పర్యటన ఇలా... 
దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ గత ఏడాది మార్చి 3వ తేదీన ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించారు. మళ్లీ ఏడాదిన్నర తర్వాత గురువారం వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్‌ నుంచి నుంచి డోన్‌ వరకు రైల్వే స్టేషన్లను పరిశీలించనున్నారు. ఆ తర్వాత కర్నూల్‌ మీదుగా ఉమ్మడి జిల్లాలోకి ప్రవేశిస్తారు. తొలుత ఉదయం 11.30 గంటలకు శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ(అలంపూర్‌) స్టేషన్‌కు చేరుకుని ఎల్‌సీ 127 కిలోమీటర్ల వద్ద పనులను పరిశీలించనున్నారు. అక్కడి స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానళ్లను ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.

అనంతరం పూ డూర్‌ స్టేషన్, మైనర్‌ బ్రిడ్జి పనులను పరిశీలించనున్న జీఎం.. గద్వాలకు చేరుకుని రైల్వే కాలనీ పరిశీలంచడంతోపాటు ఆన్‌లైన్‌ ప్రింటింగ్‌ మెషిన్, చిల్డ్రన్స్‌ పార్క్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత శ్రీరాంనగర్‌ స్టేషన్‌కు చేరుకుని కృష్ణా నదిలో నిర్మించనున్న స్టీల్‌ గ్రిడర్‌ బ్రిడ్జి పనులను పరిశీలిస్తారు. అనంతరం మహబూబ్‌నగర్‌ స్టేషన్‌కు సాయంత్రం చేరుకుంటారు. ఇక్కడ స్టేషన్‌ను తనిఖీ చేయడంతోపాటు ఆవరణలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ మొబైల్‌ థియేటర్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయం, ఉద్యోగుల నూతన క్వార్టర్లను ప్రారంభించనున్నారు. అలాగే, స్కౌట్స్, గైడ్స్‌ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన సమావేశంలో జీఎం పాల్గొంటా రని అధికారులు వివరించారు. 

ఆదర్శ రైల్వేస్టేషన్‌గా ఎంపిక చేయాలి 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రైల్వే పరిధిలో దాదాపు 100కుపైగా రైల్వే గేట్లు, తిమ్మాపూర్‌ నుంచి ఆలంపూర్‌ వరకు 191 కిలోమీటర్ల రైలు మార్గం ఉంది. మహబూబ్‌నగర్‌ స్టేషన్‌ మీదుగా ప్రతిరోజు 45 నుంచి 50కుపైగా రైళ్లు వెళ్తుంటా యి. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలో రెండో పెద్ద స్టేషన్‌ పాలమూరుకు పేరుంది. జిల్లాలోని స్టేషన్ల మీదుగా వెళ్లే రైళ్లలో ప్రయాణిం చే వారి ద్వారా రైల్వే శాఖకు నెలకు రూ.90 లక్షల నుంచి రూ.కోటి వరకు ఆదాయం సమకూరుతోంది. అయినా జిల్లా స్టేషన్లలో రైల్వే సౌకర్యాల కల్పనలో ఎప్పుడూ అన్యాయం జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. జిల్లా స్టేషన్‌కు ఆదర్శ స్టేషన్‌ హోదా ప్రకటించి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆదర్శ స్టేషన్‌గా ఎంపికైతే ఎస్కలేటర్లు, పరిశుభ్రమైన మినరల్‌ వాటర్‌ ప్లాం ట్, ఏటీఎంతో పాటు షాపింగ్‌ కాంప్లెక్సులు ఏర్పాటవుతాయి. ఈ మేరకు జీఎం దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు