ప్రత్యేక రైళ్లలో పాటించాల్సిన సూచనలు

30 May, 2020 18:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు జూన్‌ ఒకటో తేదీ నుంచి 200 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. నాన్‌ ఏసీ, సెకండ్‌ క్లాస్‌ బోగీలుండే ఈ రైళ్లు ప్రతి రోజూ నడుస్తాయని తెలిపింది. ఇక ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ప్రయాణ సమయంలో ప్రయాణికులు తీసుకోవల్సిన పలు సూచనలు, జాగ్రత్తలను విడుదల చేసింది. అవి ఇలా ఉన్నాయి..

  • ప్రత్యేక రైళ్ల ద్వారా ప్రయాణం చేసే ప్రయాణికులు రైలు బయలుదేరే సమయం కంటే 90 నిమిషాల ముందు స్టేషన్‌కు చేరుకోవాలి.
  • రైల్వే స్టేషన్‌లో రైల్వే కూలీలు తక్కువగా అందుబాటులో ఉన్నందున సాధ్యమైనంత తక్కువ లగేజీని వెంట తెచ్చుకోవాలి.
  • ప్రయాణికులు ప్రయాణ టిక్కెట్ లేకుండా రైలు ఎక్కరాదు. సరైన ప్రయాణ టిక్కెట్ లేని వారిని రైల్వే స్టేషన్‌లోనికి ప్రవేశించకుండా నివారించడానికి తనిఖీ చేయడం జరుగుతుంది.
  • సాధ్యమైనంతవరకు రైల్వే స్టేషన్‌లో ప్రవేశించేందుకు, బయటకు వెళ్లేందుకు ప్రత్యేక ద్వారాలను ఏర్పాటు చేయడం జరిగింది.
  • రైల్వే స్టేషన్లలో ప్యాసింజర్లకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి కావున ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వారిని మాత్రమే స్టేషన్‌లోని అనుమతిస్తారు.
  • స్క్రీనింగ్ సమయంలో కరోనా లక్షణాలు కనబడితే ప్రయాణానికి అనుమతించడం కుదరదు. 
  • దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రయాణికులు (రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, కేన్సర్‌, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు) గర్భవతులు 10 సంవత్సరాల లోపు పిల్లలు 65 ఏళ్ల పైబడినవారు రైలు ప్రయాణం చేయకపోతే మంచిది.
  • ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకున్న స్టేషన్‌లో స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి.
  • రైల్వే స్టేషన్‌లో ప్రవేశ, బయటకు వెళ్లే  ద్వారాలను ప్రయాణికులు ఉపయోగించుకునేందుకు ఏర్పాట్లు చేశాం.  
  • ప్రయాణం పూర్తయ్యేవరకు ప్రయాణికులు తప్పకుండా మాస్కులు ధరించాలి.
  • ప్రత్యేక రైళ్లలో టికెట్ చెకింగ్ సిబ్బందితో పాటు ఇతర సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఏదైనా అత్యవసరం అనుకుంటే ప్రయాణికులు వారి సహాయం పొందవచ్చు.
  • ప్రయాణికులు వినియోగించే టాయిలెట్లు ఇతర ప్రదేశాలను తరచుగా శానిటైజ్‌ చేయడం జరుగుతుంది.
  • రైలులో దుప్పట్లు సరఫరా ఉండదు కాబట్టి ప్రయాణికులు తప్పనిసరిగా సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి.
  • ప్రయాణికులు తమ ఆహారం వెంట తెచ్చుకుంటే మంచిది. స్టేషన్ల వద్ద ఆహార పదార్ధాల అమ్మకపు కేంద్రాలు తెరచి ఉంటాయి. కానీ, అల్పాహారా కేంద్రాలు ఉండవు కాబట్టి తయారు చేసిన ఆహారం తీసుకెళ్లవచ్చు.
  • ప్రయాణికులు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 
మరిన్ని వార్తలు