దక్షిణమధ్య రైల్వే ధగధగ

8 Feb, 2018 03:29 IST|Sakshi

     75 వేల ఎల్‌ఈడీ లైట్లు.. రూ.2.7 కోట్ల ఆదా

     దేశంలోనే తొలి జోన్‌గా రికార్డు

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే మరో అరుదైన మైలురాయిని అందుకుంది. భారతీయ రైల్వేలో వందశాతం ఎల్‌ఈడీ లైట్లను వినియోగిస్తున్న జోన్‌గా ఘనత సాధించింది. ఈ జోన్‌ పరిధిలోని 733 స్టేషన్‌లలో సంప్రదాయ లైటింగ్‌ వ్యవస్థను తొలగించి వాటి స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు.

విద్యుత్‌ను ఆదా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా అమలుచేసిన జోన్‌గా నిలిచింది. గతంలో ఆన్‌లైన్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కాచిగూడను ఇదే తరహాలో వంద శాతం నగదు రహిత లావాదేవీలు జరిపే స్టేషన్‌గా తీర్చిదిద్దారు. అప్పట్లో దేశంలో వందశాతం ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిపిన తొలి స్టేషన్‌గా అది గుర్తింపు పొందింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీటిని అమలు చేస్తున్నారు. తొలుత గుంతకల్, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, సికింద్రాబాద్, నాందేడ్‌ ఇలా కొన్ని నెలల్లో విడతలవారీగా పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు