రెండ్రోజుల్లో  ‘నైరుతి’!

10 Jun, 2020 01:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నేడు ఉమ్మడి నల్లగొండ, పాలమూరు జిల్లాల్లో భారీ వర్షాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోకి వచ్చే 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న 48 గంటల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు రాయలసీమ, కోస్తా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశముందని మంగళవారం వివరించింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్‌ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి బలపడే అవకాశముందని తెలిపింది.

ఇటు ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు రెండ్రోజుల పాటు కురిసే అవకాశముందని పేర్కొం ది. బుధవారం మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. గురువారం కూడా ఒకట్రెం డుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని కూడా వాతావరణ కేంద్రం వివరించింది. 

మరిన్ని వార్తలు