సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు గురువారం రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. రుతుపవనాలు ఇప్పటికే ఏపీలోని కర్నూలు, మచిలీపట్నంలోకి ప్రవేశించాయన్నారు. ముందుగా మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని చెప్పారు. మరోవైపు రుతుపవనాల రాక ముందే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. గత 24 గంటల్లో కొడంగల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దేముల్, యాచారం లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.