త్వరగా పూర్తి చేయకుంటే.. బ్లాక్‌లిస్టులో పెడతాం

21 Jan, 2018 02:02 IST|Sakshi

భగీరథ పనులపై సీఎస్‌ అసంతృప్తి

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ పథకాన్ని త్వరగా ఎందుకు పూర్తి చేయడం లేదని వర్క్‌ ఏజెన్సీ ప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ నిలదీశారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఏజెన్సీలు పనిచేయకుంటే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. మార్చి 31 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నీటి సరఫరా జరగాల్సిందేనన్నారు.

పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం సచివాలయంలో భగీరథ పనులు ఆశించనంత వేగంగా జరగని సూర్యాపేట, ఆదిలాబాద్‌ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, చీఫ్‌ ఇంజనీర్లు విజయ్‌ ప్రకాశ్, జగన్మోహన్‌రెడ్డితో పాటు కాంట్రాక్టు సంస్థలు జీవీపీఆర్, మెగా ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు.

అలాగే శుక్రవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భగీరథ పనులపై సమీక్షించిన ఆయన.. త్వరగా పనులు పూర్తి చేసేలా దిశానిర్దేశం చేశారు. భగీరథ పను లు 90 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులు పూర్తికి కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు