దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ: స్పీకర్‌ 

3 Jun, 2018 02:02 IST|Sakshi
తెలంగాణ శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటైన నాలుగేళ్లలోనే దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతోందని శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకొని అసెంబ్లీ ఆవరణలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.

ఎందరో త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రంలో, అమరుల ఆశయాలను సాధించుకోవడానికి నిరంతర కృషి జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి దేశమే ఆశ్చర్యపోతోందని వ్యాఖ్యానించారు. ఇదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ సాధించుకోవాలన్నారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ అమ్మ వారి గుడిలో స్పీకర్‌ ప్రత్యేక పూజలు చేశారు.  
తెలంగాణ భవన్‌లోనూ.. 
రాష్ట్రావతరణ వేడుకలను తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జాతీయజెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, పలువురు నేతలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు