బాయిమీది పేరే లెక్క.. 

21 Jul, 2019 07:38 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న వెంకట్రావు

రెండు పేర్లున్నాయనే సాకుతో ‘కారుణ్యం’లో అడ్డుపడొద్దు  

టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావు 

గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): సింగరేణి కార్మికునికి వంద పేర్లున్నా బాయిమీద ఉన్న పేరునే యాజమాన్యం లెక్కలోకి తీసుకోవాలని టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు బి.వెంకట్రావు డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక యూనియన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు పేర్లున్నాయనే సాకుతో కార్మికుల పిల్లలకు ఉద్యోగాలిచ్చేందుకు అడ్డుపడుతున్నారని, విజిలెన్స్‌ విచారణతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మారు పేర్ల మార్పుకు హామీ ఇచ్చినా సింగరేణి అదికారులు మాత్రం విజిలెన్స్‌ విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేయడం శోచనీయమన్నారు.  

కేటీఆర్‌ దృష్టికి సమస్యలు.. 
సింగరేణి కార్మికుల ఎదుర్కొంటున్నసమస్యలను సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్, కోల్‌బెల్ట్‌ప్రాంత ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా..  వెంటనే ఆయన  సీఎండీతో మాట్లాడారని తెలిపారు..  ఆగస్టు రెండో వారంలో మరోసారి కేటీఆర్‌ను కలుస్తామన్నారు. టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ సంస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని జాతీయ సంఘాలు విమర్శించడంలో అర్థం లేదన్నారు.  ముఖ్యమంత్రి జోక్యంతోనే కారుణ్య నియామకాలు ప్రారంభమైన విషయాన్ని మర్చిపోవద్దన్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీని ధిక్కరించి వేరే ప్రచారం నిర్వహిస్తే వేటు తప్పదని వెంకట్రావు హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌పార్టీ గెలుపుకోసం టీబీజీకేఎస్‌ శ్రేణులంతా కష్టించి పనిచేయాలన్నారు.  

కెంగర్లకు పదవి లేదు 
యూనియన్‌ బైలాస్‌ ప్రకారం టీబీజీకేఎస్‌ యూనియన్‌లో కెంగర్ల మల్లయ్యకు పదవి లేదని వెంకట్రావు అన్నారు. బైలాస్‌ ప్రకారం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్టు లేదని.. ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో ప్రత్యేకంగా పదవి ప్రకటించిన విషయం వాస్తవమేనని, తర్వాత యూనియన్‌లో ఈపోస్టును సవరించాల్సి ఉన్నప్పటికి సాధ్యం కాలేదన్నారు. కనకం శ్యాంసన్, నూనె కొమురయ్య, గండ్ర దామోదర్‌రావు, దేవ వెంకటేశం, వెంకటేష్, పుట్ట రమేష్, ఎట్టెం క్రిష్ణ, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు