అభివృద్ధికి ప్రత్యేక నిధులు

5 Feb, 2018 19:43 IST|Sakshi

     మున్సిపాలిటీలకు బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు..

     2019–20లో రూ.2 లక్షల కోట్లతో బడ్జెట్‌

     అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట

     ఆర్మూర్‌లో కేసుల పెండెన్సీ ఉంటే సబ్‌ కోర్టు మంజూరు

     రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ఆర్మూర్‌ : రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించ నుందని, ప్రతి మున్సిపాలిటీకి రూ.50 కోట్ల నుంచి రూ.75 కోట్ల వరకు కేటాయింపులుంటా యని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ పట్టణాభివృద్ధికి మంజూరైన రూ.25 కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు, భవిష్యత్‌లో మంజూరు కానున్న మరో రూ.25 కోట్ల తో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పట్టణం లోని అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ఆదివారం  ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ స్వాతి సింగ్‌ అధ్యక్షతన క్షత్రియ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ఇంద్రకణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజల అభిప్రాయాలను సేకరించి నిధు ల కేటాయించడం అభినందనీయమన్నారు. నియోజకవర్గంలో సిద్దుల గుట్టతో పాటు మరో 50 ఆలయాలకు నిధులు మంజూరు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పేదలు ఆత్మగౌరవం తో జీవించాలనే లక్ష్యంతో చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణాలు త్వరలో పూర్తవుతాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు చేపట్టిన పనులను సీడబ్ల్యూసీ కమిటీ ప్రతినిధులు చూసి కితాబునిచ్చారన్నారు. 2019–20 సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.2 లక్షల కోట్లకు పెరగనుందన్నారు. సీఎం కేసీఆర్‌ అభివృద్ధి పనుల తరువాత సంక్షేమానికి పెద్ద పీట వేయనున్నారన్నారు. ఆర్మూర్‌ కోర్టులో కేసుల పెండెన్సీ ఉంటే సబ్‌ కోర్టును మంజూరు చేస్తామన్నారు.


అభివృద్ధిలో అన్ని వర్గాల భాగస్వామ్యం


ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఆర్మూర్‌ మున్సిపాలిటీని ఆదర్శం గా నిలిపేవిధంగా అభివృద్ధి చేస్తామన్నారు. గత పాలకులు పట్టణాభివృద్ధిని విస్మరించారన్నారు. కానీ ప్రస్తుతం పట్టణంలో రూ.31 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. త్వరలో మరిన్ని నిధులు మంజూరవుతాయని, పట్టణ రూపు రేఖలు మారిపోనున్నాయన్నారు. అన్ని వర్గాల వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మోత్కూరి లింగాగౌడ్, కౌన్సిలర్లు, న్యాయవాదులు, స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు, ఐఎంఏ ప్రతినిధులు, మర్కజి కమిటీ ప్రతినిధులు, కుల, యువజన సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


ఆలయాల అభివృద్ధికి పెద్దపీట


మాక్లూర్‌(ఆర్మూర్‌) : ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని మామిడిపల్లి గ్రామ శివారులో కొనసాగుతున్న  శ్రీఅపురూప వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వంటశాల గదిని ప్రారంభించారు. ఆలయ ఆవరణలో కల్యాణ మండపం నిర్మాణానికి రూ.50 లక్షలు మాంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు మాంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గం గోని సంతోష్, ఎంపీటీసీ సభ్యులు ఎనుగం టి లక్ష్మీ, ఎంపీపీ గురిజాల శిరీష, ఆలయ చైర్మన్‌ అమృతలత, మాజీ జెడ్పీటీసీ సభ్యు లు ఆకుల విజయ, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు