ఒక్కపూట భోజనం.. రెండు పూటలా స్నానం

24 Dec, 2015 02:59 IST|Sakshi
ఒక్కపూట భోజనం.. రెండు పూటలా స్నానం

♦ 1,500 మంది నిష్టాగరిష్టులైన రుత్విక్కులకు ప్రత్యేక వంటకాలు
♦ 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భోజనశాల
♦ ఒక్కపూటకు 4 క్వింటాళ్ల బియ్యం.. క్వింటాలు పప్పు.. క్వింటాలు కూరగాయలు
♦ కేరళ నుంచి తెప్పించిన పోకచెక్క ఆకు విస్తర్లు
♦ 40 మంది బ్రాహ్మణోత్తములతో వంటకాలు
♦ వడ్డించడం కోసం మరో 120 మంది బ్రాహ్మణులు
 
 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అయుత చండీయాగానికి రుత్విక్కులే కీలకం. పరమ నిష్టాగరిష్టులైన 1,500 మంది పండితులు.. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి తరలి వచ్చారు. యాగం ప్రారంభం నుంచి పరిసమాప్తి వరకు ప్రతి ఒక్కరూ ఒకపూట మాత్రమే భోజనం చేస్తారు. యాగశాలలో మంచినీళ్లు కూడా ముట్టరు. రెండు పూటలా స్నానమాచరిస్తారు. దీక్షా వస్త్రాలను ధరిస్తారు. దీక్షాబద్ధులు యాగం జరిగే ప్రాంతాన్ని విడిచి వెళ్లరు. దేవనాంది చేయడం వల్ల వీరికి జాతశౌచాలు అంటవు. అత్యంత నిష్టతో ఉండే వీరికి రుచికరమైన ప్రత్యేకమైన భోజన వసతులు ఏర్పాటు చేశారు. రుత్విక్కులకు వంట ఏర్పాట్లు చూసే బాధ్యత ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కు అప్పగించారు.

వంటల కోసం ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నుంచి 40 మంది బ్రాహ్మణోత్తములను ప్రత్యేకంగా రప్పించారు. వడ్డించడం కోసం ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి 120 మంది బ్రాహ్మణులను తీసుకువచ్చారు. పోకచెక్కల ఆకులతో ప్రత్యేకంగా తయారు చేయించిన విస్తర్లను కేరళ నుంచి తెప్పించారు. వీరి కోసం 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భోజనశాలను ఏర్పాటు చేశారు.

 వీఐపీలు, స్థానిక బ్రాహ్మణులకు...
 వీఐపీలు, స్థానిక బ్రాహ్మణుల కోసం వీఐపీ లాంజ్ పక్కనే మరో భోజనశాల ఏర్పాటు చేశారు. ఈ మెనూ కూడా దాదాపు రుత్వికుల మెనూనే పోలి ఉంది. కానీ బఫే పద్ధతిలో, ప్లాస్టిక్ విస్తర్లతో భోజనం ఏర్పాటు చేశారు. ఈ భోజనాలకు కూడా 4 క్వింటాళ్ల బియ్యం, క్వింటాలు కూరగాయలు, క్వింటాలు పప్పు, 5 క్వింటాళ్ల పెరుగును వినియోగిస్తున్నారు.
 
 ఫాంహౌస్ నుంచే కూరగాయలు, పూలు
 యాగంలో ప్రత్యేక వంటల కోసం కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచే కూరగాయలు తరలిస్తున్నారు. మొత్తం  మూడు వంటశాలలు ఏర్పాటు చేశారు. రుత్విక్కుల కోసం ఒకటి, వీఐపీలు, సాధారణ బ్రాహ్మణులకు మరోటి, భక్తుల కోసం ఇంకొక వంటశాలలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. రుత్విక్కుల వంటశాలలోకి ఇతరులకు ప్రవేశం లేదు. తయారు చేస్తున్న కూరల్లో 80 శాతం కూరగాయలను కేసీఆర్ ఫాంహౌస్ నుంచే కోసి నేరుగా తీసుకుని వస్తున్నారు. క్యాప్సికం, క్యాబేజీ, బెండకాయ, దొండకాయ, టమాటా, ఆలుగడ్డ, మెంతికూర, పచ్చిమిర్చి, పాలకూర తదితర కూరగాయలను ఫాంహౌస్ నుంచే తీసుకువచ్చారు.

వంకాయ, కొంత టమాటా మాత్రమే బయటి నుంచి తెచ్చామని రుత్విక్కుల భోజన వసతి బాధ్యతలు చూస్తున్న ఎమ్మెల్సీ సతీశ్ ‘సాక్షి’కి తెలిపారు. ఇక యాగానికి ఫాంహౌస్‌లోని బంతి, చామంతి పూలనే వినియోగిస్తున్నారు. గులాబీ, తామర పుష్పాలతో పాటుగా కొన్ని చామంతి పూలను బెంగుళూరు నుంచి తీసుకువచ్చినట్లు సమాచారం.


 ఏ రోజు.. ఏ మెనూ


  తొలిరోజు మెనూ..
► ఉదయం అల్పాహారం: ఇడ్లీ, వడ, ఉప్మా
► మధ్యాహ్న భోజనం: అన్నం, చపాతి, ముద్దపప్పు, సాంబారు, పాతాలబాజీ (శనగపప్పు ఆకుకూర, బెల్లం), చల్ల పులుసు, బీన్స్ ఫ్రై, పూర్ణాలు, పులిహోర, అరటికాయ బజ్జీ, పెరుగు, పాపడ, రోటి పచ్చడి.
► రాత్రి అల్పాహారం : అటుకుల కిచిడి.
 
 రెండో రోజు
► ఉదయం అల్పాహారం : అటుకుల పొంగళి, చట్నీ.
► మధ్యాహ్న భోజనం : అన్నం, చపాతి, ఆకుకూర పప్పు, రసం, క్యాప్సికం కూర, సాంబారు, ఆలుబోండ, బాదుషా, పులిహోర, రోటి పచ్చడి.
► రాత్రి అల్పాహారం: పూరి, పన్నీర్ బటర్ మసాల, ఆలు కుర్మా.
 
 మూడో రోజు
► ఉదయం అల్పాహారం: అటుకుల పోని, చట్నీ, పెరుగు.
► మధ్యాహ్న భోజనం : అన్నం, చపాతి, పులిహోర, టమాటా పప్పు, పోని చల్ల, మసాల
  వంకాయ, సాంబారు, శనగ లడ్డూ, మైసూర్ బజ్జీ, గుమ్మడికాయ బర్డా.
► రాత్రి అల్పాహారం : బొంబాయి రవ్వ ఉప్మా, చట్నీ, పెరుగు.
 
 నాలుగో రోజు
► ఉదయం అల్పాహారం: ఇడ్లీ, వడ, సాంబారు, చట్నీ.
► మధ్యాహ్న భోజనం: అన్నం, చపాతి, పులిహోర, ఆకుకూర పప్పు, చల్ల పులుసు, పన్నీర్ బటర్ మసాల, దొండకాయ మసాల, సాంబారు, జిలేబీ, ఆలుబాత్, మిర్చీ రైతా.
► రాత్రి అల్పాహారం: అటుకుల దద్దోజనం.
 
 చివరి రోజు
 ► ఉదయం అల్పాహారం : ఉప్మా చుడువ.
► మధ్యాహ్న భోజనం: అన్నం, చపాతి, పులిహోర, ముద్దపప్పు, పోని చల్ల, బెండకాయ ఫ్రై, క్యాప్సికం కూర, మోతి చూరబూంది లడ్డూ, పాలకూర బజ్జీ, మెంతికూర పెసర పప్పు, సాంబారు, పెరుగు.
► రాత్రి అల్పాహారం:  దద్దోజనం, మిరపబజ్జీ.
 
 ఒక్క పూటకు వినియోగిస్తున్న బియ్యం, పప్పు, కూరగాయల వివరాలు..
 బియ్యం: 4 క్వింటాళ్లు
 కూరగాయలు : ఒక క్వింటాలు
 పప్పు: ఒక క్వింటాలు
 చపాతి: 6 వేలు
 పెరుగు : 5.25 క్వింటాలు
 
 వస్త్ర ధారణ ఇలా..
 తొలిరోజు: పసుపు పచ్చ వర్ణ వస్త్రాలు, వాటికి ముదురు మెరూన్ రంగులో పట్టు అంచు
 రెండో రోజు: ఎరుపు వర్ణ వస్త్రాలు
 మూడో రోజు: గులాబీ వర్ణం పంచెలు, దోవతులు, దానికి పట్టు అంచు
 నాలుగో రోజు: తెలుపువర్ణం పంచెలు, దోవతులు, వాటికి బంగారు రంగు పట్టు అంచు
 ఐదో రోజు: పసుపు పచ్చ వర్ణం వస్త్రాలు, వాటికి ముదురు మెరూన్ రంగులో పట్టు అంచు
 
 అటు ఉద్యమం.. ఇటు ఆధ్యాత్మికం!
 1997లో తొలిసారి చండీయాగం నిర్వహించిన కేసీఆర్
 
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణవాదాన్ని, ఆధ్యాత్మికాన్ని రెండు కళ్లుగా చేసుకున్నారు. ఒకవైపు ఉద్యమం చేస్తూనే మరోవైపు యజ్ఞయాగాలు నిర్వహించి మహా పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. 1997 లో తొలిసారిగా చండీయాగాన్ని నిర్వహించిన కేసీఆర్ ఆ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.

 కేసీఆర్ ఇప్పటి వరకు నిర్వహించిన యాగాలు, ఇతర ధార్మిక కార్యక్రమాలివీ..
  1994: సిద్దిపేటలో శ్రీత్రిదండి చిన జీయర్‌స్వామి పర్యవేక్షణలో బ్రహ్మయజ్ఞం నిర్వహించారు.
  1996: ఎర్రమంజిల్‌లోని ఎమ్మెల్యేల గృహ సముదాయంలో సహస్ర లక్ష్మీ సూక్త పారాయణాలు, అభిషేకాలు నిర్వహించారు.
  1996: రాష్ట్ర రవాణ శాఖ మంత్రిగా తన అధికారిక నివాసంలో సహస్ర లక్ష్మీసూక్త పారాయణ సహిత అభిషేకం నిర్వహించారు.
  1997: తొలిసారి బాపిశాస్త్రి పర్యవేక్షణలో చండీ హవణం చేపట్టారు.
  2004: గోదావరి తీరంలో శత చండీయాగం చేశారు. ఈ యాగాన్ని శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి చేయించారు.
  2005: కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నవగ్రహ మఠం-చండీయాగం చేశారు.
  2006: మెదక్ జిల్లా కొండపాక మండలం మర్పడగలోని శ్రీ సంతానమల్లికార్జున స్వామి దేవాలయంలో 500మంది రుత్విక్కులతో సహస్ర చండీయాగం చేశారు. అదే ఏడాది తన నివాసంలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు.
  2007: పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో చండీయాగం, సుదర్శన యాగాలను నిర్వహించారు.
  2008: సిద్దిపేటలోని కోటి లింగేశ్వరాలయంలో గాయత్రీ మహాయాగం చేశారు.
  2009: తెలంగాణ భవన్‌లో నక్షత్ర మండల యాగం.
  2010: తెలంగాణ భవన్‌లో చండీయాగం.
  2014: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్యాంపు కార్యాలయంలో సుదర్శన యాగం నిర్వహించారు.
  2015: ఎర్రవల్లిలో అయుత చండీయాగం నిర్వహిస్తున్నారు.
 
 యాగం ఫలప్రదమవుతుంది
 శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామి సందేశం
 
 గజ్వేల్: ‘‘సీఎం కేసీఆర్ లోక కల్యాణార్థం చేపట్టిన అయుత మహాచండీ యాగం విజయవంతమవుతుంది. ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు’’ అని శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామి సందేశాన్ని పంపారు. పీఠం ముఖ్యకార్యనిర్వహణాధికారి గౌరీశంకర్ ద్వారా లేఖను పంపారు. దీన్ని యాగస్థలిలో రుత్విక్కులు చదివి వినిపించారు. గౌరీశంకర్ మాట్లాడుతూ.. 200 ఏళ్ల చరిత్రలో ఏ చక్రవర్తి, పాలకుడు ఇంత పెద్దఎత్తున యాగం నిర్వహించిన దాఖలాల్లేవన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి  వచ్చినవారితో యాగస్థలి ‘మినీ ఇండియా’ను తలపిస్తోందన్నారు. ఈ యాగం చరి త్రలో నిలిచిపోతుందన్నారు.

నాలుగేళ్ల క్రితం శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామి నిర్వహించిన పద్ధతిలోనే కేసీఆర్ యాగం చేస్తున్నారని కొనియాడారు. పిల్లలకు ఇబ్బంది కలిగితే తల్లి అనుగ్రహించినట్లుగానే ప్రజల బాగోగుల కోసం పాలకులు చండీ మాతను ఆశ్రయించారన్నారు. కేసీఆర్ ఇప్పుడు చండీయాగం చేస్తున్నది తల్లి అనుగ్రహం కోసమే అన్నారు. మహారాజులూ చేయలేని బృహత్కార్యాన్ని ప్రజా సంక్షేమం కోసం తలకెత్తుకున్న కేసీఆర్ సంకల్పం నెరవేరాలని ఆకాంక్షించారు.
 
 భారీగా తరలివచ్చిన భక్తజనం
  తొలిరోజు అయుత చండీయాగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎర్రవల్లి సమీప గ్రామాలతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. తొలిరోజు సుమారు 10 వేల వాహనాలు వచ్చినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎర్రవల్లి చుట్టూ ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి దాదాపు 3 వేల మంది పోలీసులను మోహరించారు. జిల్లా ఎస్పీ సుమతితో పాటు ఆరుగురు ఏఎస్పీలు, 28 మంది డీఎస్పీలు బందోబస్తును పర్యవేక్షించారు. పోలీసులు సాధారణ భక్తులను కొంత ఇబ్బందులకు గురిచేశారు. కొందరు కానిస్టేబుళ్లు భక్తులపై దురుసుగా ప్రవర్తించడం, దుర్భాషలాడడం కనిపించింది. ఇక మీడియా ప్రతినిధులనైతే కనీసం దగ్గరకు కూడా అనుమతించలేదు. ట్రాఫిక్ నియంత్రణ కోసమంటూ దారులు మూసివేయడంతో.. నర్సన్నపేట నుంచి వచ్చిన భక్తులు ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 
 చండీయాగం.. క్షణక్షణం
 ఉదయం
► 8:30: యాగశాలకు సీఎం దంపతుల ఆగమనం
► 8:48: యాగశాలకు గవర్నర్ నరసింహన్ దంపతుల రాక
► 9:15 : పూజలు ప్రారంభం
► 10: 30: దుర్గాదేవికి మహా మంగళ హారతి ఇచ్చిన యాగ యజమాని కేసీఆర్
►10:40: ఒక్కో హోమగుండం చుట్టూ నలుగురు తెలుగు, ముగ్గురు కన్నడ, ముగ్గురు మరాఠా, ఒకరు ఇతర రాష్ట్రానికి చెందిన మొత్తం 11 మంది రుత్విక్కులు ఆసీనులయ్యారు
►10:50: శృంగేరీ శారదా పీఠాధీశ్వరులు భారతీ తీర్థస్వామి పంపిన సందేశాన్ని చదివి వినిపించిన రుత్విక్కులు
►11:19: ఏకోత్తర వృద్ధి సంప్రదాయ పద్ధతిలో జపాలు ప్రారంభించిన 1,100 మంది రుత్విక్కులు
 మధ్యాహ్నం:
►1:40: ముగిసిన తొలిరోజు పారాయణం. 4 వేల నవార్ణ మంత్రజపం పూర్తి
► 2:05: విడిది కేంద్రాలకు రుత్విక్కులు
► సాయత్రం 5:50: హైకోర్టు తాత్కాలిక సీజే బొసాలే రాక. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన సీఎం.
► 6:05: హైకోర్టు జడ్జి చంద్రయ్య రాక.
► 6:15: యాగస్థలానికి హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతీస్వామి రాక
 - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

మరిన్ని వార్తలు