‘ఇతరుల’పై చిన్నచూపేనా?

6 Nov, 2018 09:24 IST|Sakshi

ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్‌లు తెలంగాణలో గుర్తింపే కరువు 

జిల్లా వ్యాప్తంగా 153 మంది ఓటరుగా నమోదు 

ట్రాన్స్‌జెండర్స్‌.. హిజ్రాలు.. ఇతరులు పేరేమైన వారు మాత్రం నిరాధరణకు గురవుతున్నారు. తెలంగాణలో ఎలాంటి సంక్షేమ సహాయ కార్యక్రమాలు లేకపోవడంపై వారు ప్రశ్నిస్తున్నారు. తమ సంక్షేమానికి ఎవరు కట్టుబడితే వారికే ఓట్లు వేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇతరులు.. వారి డిమాండ్లపై ప్రత్యేక కథనం.. 

రామగుండం:   ట్రాన్స్‌జెండర్స్‌.. హిజ్రాలు.. ఇతరులు పేరేమైన వారు మాత్రం నిరాధరణకు గురవుతున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు తమ సంక్షేమంపై పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో ఇతరులకు ప్రతీ నెల రూ.1,500 పింఛన్‌ ఇవ్వడంతోపాటు, విద్య, ఉద్యోగావకాల్లో రిజర్వేషన్‌లు కల్పిస్తున్నారు. అయితే తెలంగాణలోనే ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ సహాయ కార్యక్రమాలు లేకపోవడంపై వారు ప్రశ్నిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే నాయకులను నిలదీస్తామంటున్నారు. తమ సంక్షేమానికి ఎవరు కట్టుబడితే వారికే ఓట్లు వేస్తామని స్పష్టం చేస్తున్నారు.  

సుప్రీం తీర్పు అనంతరం 
నాలుగేళ్ల క్రితం ట్రాన్స్‌జెండర్స్‌–హిజ్రాలు తమ ఓటరు నమోదుకు కొందరు పురుషులు, మరికొందరు స్త్రీల జాబితాలో పేర్తు నమోదు చేసుకునే వారు. అయితే 2014లో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అన్నిరంగాల్లోని ట్రాన్స్‌జెండర్స్‌–హిజ్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ట్రాన్స్‌జెండర్స్‌కు మూడో వరుస ఏర్పాటు చేసి ఇతరులుగా పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో 2,667 మంది నూతనంగా నమోదు చేసుకోగా ఉమ్మ డి కరీంనగర్‌ జిల్లాలో 153 మంది ఓటరుగా నమోదు చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2014కు ముందు రాష్ట్ర వ్యాప్తంగా దాదా పు 1.20 లక్షల మంది ఉన్నట్లు హిజ్రాల రాష్ట్ర ప్రతినిధి లైలా తెలిపారు. హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని గోర ఖ్‌పూర్‌లలో కార్పొరేషన్‌ మేయర్లుగా కొనసాగగా, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు ఎమ్మెల్యేగా గెలుపొందారు.  

నియోజకవర్గాల వారీగా.. 
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో 12 నియోజకవర్గాలుండగా కరీంనగర్‌ నియోజకవర్గ పరిధిలో 36 మంది, రామగుండంలో 29, చొప్పదండిలో ఇద్దరు, హుజూరాబాద్‌లో 17, వేములవాడలో 3, జగిత్యాలలో 15, కోరుట్లలో 6, ధర్మపురిలో 3, మం థనిలో 21, పెద్దపల్లిలో 21 మంది హిజ్రాలు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. మానకొండూ ర్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఒక్కరూ లేరు.  

కొన్ని రాష్ట్రాల్లోనే గుర్తింపు  
సుప్రీంకోర్టు 2014లో ఇచ్చిన తీర్పును కొన్ని రాష్ట్రాల్లోనే అమలు చేస్తున్నారు. ఒడిషా, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రా ల్లో హిజ్రాలకు రూ.1,500 పింఛన్‌ ఇస్తున్నారు. వీరి సం క్షేమానికి రాష్ట్ర బడ్జె ట్‌లో రూ.20 కోట్లు వెచ్చించాలని నిర్ణయించాయి. విద్యావకాశాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తుండగా, వా రి కోసం ప్రత్యేక సంక్షేమ రెసిడెన్షియ ల్‌ విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్న ట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రధాన కూడళ్ల లో ప్రత్యేక టాయిలెట్స్‌ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 

నిత్యం అవహేళనలే..  
మాపై ఇంటితోపాటు సమాజంలోనూ ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. ఎక్కడికి వెళ్లిన ఏదోలా చూస్తుంటారు. మా పక్కనే ఉంటూ అసభ్యకరంగా మాట్లాడుతుంటారు. నిత్యం వింటూ ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాం. ఒకవేళ ఎక్కడైనా పనికి వెళ్లిన అక్కడ మాపై ఇతరులకు వేరే భావాలు ఉంటాయి. మా క మ్యూనిటీ ని ప్రభుత్వం గుర్తించి విద్య, ఉపా ధి అవకాశా లు కల్పించాలి.
 – అర్చన, రాష్ట్ర కమిటీ ప్రతినిధి 

ఇక్కడే భిన్న నిర్ణయాలు 
ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మా కమ్యూనిటీపై ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌ అవకాశం ఇస్తున్నారు. కానీ తెలంగాణలోనే చిన్నచూపు చూస్తున్నారు. పక్క రాష్ట్రంలో విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్‌లు కల్పిస్తున్నారు. మన రాష్ట్రంలోనే గుర్తింపు లేదు. ఆరు నెలల క్రితం హైదరాబాద్‌లో భారీ సమావేశం సైతం ఏర్పాటు చేశాం. అయినా ప్రభుత్వం స్పందించలేదు.  
– ప్రగతి, బెల్లంపల్లి 

గుర్తింపు లేదు 
మన రాష్ట్రంలో హిజ్రాలకు గుర్తింపు లేదు. పోస్ట్రుగాడ్యుయేట్‌ ఎంఏ సోషియాలజీ చదివాను. వరంగల్‌ ఎమ్మెల్యే కొండ సురేఖ గత అసెంబ్లీ సమావేశాల్లో హిజ్రాల సంక్షేమంపై మాట్లాడిని ప్రభుత్వం స్పందించలేదు. ఓట్ల కోసం మాత్రం వస్తారు.. కానీ మా గురించి పట్టించుకోరు.
 ఒక సీటు కేటాయించి హిజ్రాలపై మానవత దృక్పథంతో వ్యవహరించాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. మేనిఫెస్టోలో ట్రాన్స్‌జెండర్స్‌ అంశాన్ని చేర్చాలి. ఒక ఎమ్మెల్యే సీటును 
కేటాయించాలి. 
– లైలా, అధ్యక్షురాలు, తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్‌జెండర్స్‌
– హిజ్రా అసోసియేషన్‌ 

మరిన్ని వార్తలు