ముచ్చటగా మూడో మహాసభల్లో..

12 Dec, 2017 04:12 IST|Sakshi

రేవూరు అనంతపద్మనాభరావు..

1975, 2012లో జరిగిన రెండు తెలుగు మహాసభల్లో పాల్గొన్న ఈయన ఈసారి మూడోసభల్లోనూ పాలుపంచుకోనున్నారు.  ఈ సందర్భంగా గత సభల ద్వారా తెలుగు భాషకు, సాహిత్యానికి జరిగిన ప్రయోజనాన్ని  ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలివీ..

మొదటి సభలతో...
వివిధ రాష్ట్రాలలో ఉన్న ఆంధ్ర సాంస్కృతిక సంస్థలను ఒకే వేదిక మీదకు చేర్చే ప్రయత్నం జరిగింది.
అంతర్జాతీయ తెలుగు సంస్థ ద్వారా భాషాభివృద్ధికి చేయూత లభించింది.
అజ్ఞాతంగా ఉండిపోయిన శంకరంబాడి సుందరాచారి రచన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయం ప్రాచుర్యంలోకి వచ్చి రాష్ట్రగీతంగా గుర్తింపునకు నోచుకుంది.
తెలుగు బోధనాభాషగా అభివృద్ధి చెంది తెలుగు అకాడమీ కార్యకలాపాలు విస్తరించాయి.
ఆ తర్వాత మలేషియా తదితర ప్రాంతాలలో జరిగిన మహాసభలతో అంతర్జాతీయ స్థాయిలో తెలుగు గుర్తింపు పొందింది.

రెండవ సభలు
తిరుపతిలో 2012, డిసెంబర్‌లో జరిగిన ఈ సభలకు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. అదొక భాషా బ్రహ్మోత్సవంగా జరిగాయి.
ఈ సభల ద్వారా...
► అప్పటికి తెలుగు భాషలో సంస్కృతి, భాష, కళలు, సంగీతం, నాటికలు, అష్టావధానాలు... వంటి ప్రక్రియలు విస్తరించాయి. వాటన్నింటినీ ఒకే వేదిక మీదపై పంచుకునే వీలు కలిగింది.
► తెలుగు అకాడమీ చైర్మన్‌ యాదగిరి ఆధ్వర్యంలో వందకు పైగా తెలుగు సాహిత్యాల మోనోగ్రాఫ్‌లు వచ్చాయి.
► అమెరికా వంటి దేశాలలో తెలుగు నేర్చుకునే విద్యార్థులకు ‘తెలుగుబడి’ వంటి కార్యక్రమాలకు వ్యాప్తి జరిగింది.

ఈ సభలు ఎలా ఉండనున్నాయంటే!
ఇలాంటి సభల ద్వారా ఎందరో వర్ధమాన, ప్రసిద్ధ, అజ్ఞాత రచయితలకు కళాకారులకు ప్రచారం లభిస్తుంది. అజ్ఞాతంగా ఉన్న ఎందరో తెలంగాణ కళాకారులకు తమ గళం విప్పే అవకాశం వస్తుంది. ఈ సభలు కాంతులు వెదజల్లి భాషా సంస్కృతులను ప్రపంచ వేదికలపైకి చేరుస్తాయి.
– డాక్టర్‌ రేవూరు అనంతపద్మనాభరావు, అష్టావధాని, దూరదర్శన్‌ మాజీ అడిషనల్‌ డైరెక్టర్‌

..: వాకా మంజుల

మరిన్ని వార్తలు