వన్‌ స్టేట్‌... వన్‌ షీ–టీమ్స్‌

12 Jun, 2019 02:54 IST|Sakshi
శిక్షణ కార్యక్రమంలో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఐజీ స్వాతి లక్రా, జితేందర్, సుమతి తదితరులు

షీ టీమ్స్‌కు ప్రత్యేక శిక్షణ 

ఒకే పోలీసింగ్‌ విధానం దిశగా చర్యలు.. 

మహిళల భద్రతకు పెద్దపీట

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీసింగ్‌ విధానం ఉండాలనే లక్ష్యంతో షీ–టీమ్స్‌ పనితీరులో సమగ్ర మార్పుచేర్పులు చేయడానికి డీజీపీ కార్యాలయం సిద్ధమైంది. హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌ వరకు ఏ జిల్లా కమిషనరేట్‌లోనైనా వీటి పనితీరు, స్పందన ఒకేలా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ‘యూనిఫామ్‌ సర్వీస్‌ డెలివరీ–షీ టీమ్స్‌’పేరుతో 4 రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని అన్ని యూనిట్లలోని షీ–టీమ్స్‌ సిబ్బందికి విడతల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు.

మంగళవారం హైదరాబాద్‌లోని ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఏడీజీ (శాంతిభద్రతలు) జితేందర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలు పూర్తి శాంతిభద్రతల మధ్య జీవించాలనేది దీని ముఖ్య ఉద్దేశమన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ షీ–టీమ్స్‌ అంకురార్పణ జరిగిందన్నారు. షీ–టీమ్స్‌ బృందాల విజయం ఒక్క రోజులో వచ్చింది కాదని, కొన్ని నెలల కృషి ఫలితమని వ్యాఖ్యానించారు. ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో విజయవంతమైన షీ–టీమ్స్‌ను ఆదర్శంగా తీసుకొని మరో ఆరు రాష్ట్రాలు అమలులోకి తీసుకొచ్చాయని, ఇది మన బాధ్యతల్ని మరింత పెంచింద’’న్నారు. కార్యక్రమంలో సీఐడీ ఎస్పీ బి.సుమతి తదితర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు