సాగర్‌డ్యామ్‌ వద్ద ఎస్‌పీఎఫ్‌ అప్రమత్తం

28 Feb, 2019 03:04 IST|Sakshi
వాహనాలను తనిఖీ చేస్తున్న రక్షణ దళం

నాగార్జునసాగర్‌ : పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారతవాయుసేన మెరుపుదాడులు చేసిన నేపథ్యంలో నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద ప్రత్యేక రక్షణ దళం (ఎస్‌పీఎఫ్‌) అప్రమత్తమైంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే. కీలకమైన ప్రభుత్వరంగ సంస్థలపై ఉగ్రవాదులు విరుచుకుపడవచ్చనే అనుమానాలను వ్యక్తం చేసింది.

గతంలో పాకిస్తాన్‌ టెర్రరిస్టుల వద్ద సాగర్‌డ్యామ్‌ ఫొటోలు లభ్యంకావడం, అలాగే హైదరాబాద్‌లో పట్టుబడిన సిమీ ఉగ్రవాది సాగర్‌వాసి కావడంతో సాగర్‌డ్యామ్‌ భద్రతపై స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ అప్రమత్తమైంది. ప్రాజెక్టు, విద్యుదుత్పత్తి ప్లాంట్‌లో పనిచేసే ఉద్యోగులను సైతం తనిఖీ చేసిన తర్వాతనే విధుల్లోకి పంపుతున్నారు. డ్యామ్‌ మీదుగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఆ పరిసరాల్లో ప్రతీ వాహనాన్ని పరిశీలించాకే పంపుతున్నారు.   

మరిన్ని వార్తలు