‘ఎస్సారెస్పీ వెలుగు’లకు 26 ఏళ్లు

21 Dec, 2014 02:56 IST|Sakshi
‘ఎస్సారెస్పీ వెలుగు’లకు 26 ఏళ్లు

* ఆదివారం నుంచి 27వ వసంతంలోకి.. ‘జల విద్యుదుత్పత్తి కేంద్రం’
* 120 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టాలని లక్ష్యం
* నాలుగు సార్లు మాత్రమే చేరిన వైనం

బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద నిర్మించిన జలవిద్యుదుత్పత్తి కేంద్రం 26 వసంతాలు పూర్తి చేసుకుని ఆదివారం 27వ వసంతంలోకి అడుగుపెడుతోంది. 1988 డిశంబర్ 21 న అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్  చేతుల మీదుగా  జల విద్యుత్తు కేంద్రాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.  అప్పటి నుంచి ఇక్కడి జల విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ రెండవ  ప్రయోజనమే జల విద్యుతుత్పత్తి. దీంతో ప్రభుత్వం  కాకతీయ కాలువ ప్రారంభంలో  సెప్టెంబర్ ఒకటిన రూ.  23.5 కోట్ల వ్యయంతో నిర్మించడానికి ప్రభుత్వ అనుమతి లభించింది.

మొదటి దశలో మూడు టర్బయిన్లు 27 మెగా వాట్ల ఉత్పతి జరిగేలా పనులు ప్రారంభించారు. రెండో దశలో నాల్గో టర్బయిన్  పనులు ప్రారంభించారు. 1987 జూలై లో మొదటి టర్బయిన్ పనులు పూర్తిచేసుకుంది. రెండవ టర్బయిన్ 1987 డిసెంబర్‌లో, మూడవ టర్బయిన్ 1988 జూలైలో పనులు పూర్తి చేసుకుంది. నాల్గో టర్బయిన్ 2007 డిసెంబర్‌లో పనులు ప్రారంభమై 2010 ఆగస్టులో పూర్తిచేసుకుంది. అప్పటి నుంచి 36 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి కేంద్రంగా కొనసాగుతోంది. ఈ కేంద్రాన్ని స్విట్జర్లాండ్ పరిజ్ఞానంతో నిర్మించారు.  టర్బయిన్ నిమిషానికి 250 సార్లు తిరిగి విద్యుదుత్పత్తిని జరుపుతుంది.

ప్రతి టర్బయిన్‌కు 2200 క్యూసెక్కుల నీరు అవసరం ఉంటుంది. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్తును మండంలోని బుస్సాపూర్ శివారులో ఉన్న 132 కే.వీ సబ్ స్టేషన్ కు సరఫరా చేస్తారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తారు.  24 గంటలకోసారి విద్యుత్తును లెక్కిస్తారు. ఈ జల విద్యుతుత్పత్తి కేంద్రం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరం 120 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ప్రాజెక్ట్ నీటి ఆధారంగా విద్యుతుత్పత్తి జరుగుతుంది.  

26 ఏళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే లక్ష్యాన్ని చేరింది. నాల్గు టర్బయిన్లతో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగలేదు. ప్రాజెక్ట్ అధికారులు వరద కాలువ ద్వారా నీటి విడుదల చేయడంతో  కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల పూర్తి స్థాయిలో జరగక నాలుగు టర్బయిన్ల విద్యుదుత్పత్తి జరగడం లేదు. నాల్గు టర్బయిన్లకు 8800 క్యూసెక్కుల నీరు అవసరం ఉంది. అంత స్థాయిలో కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టినా,  కాలువకు గండి పడే ప్రమాదమూ లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం జల విద్యుదుత్పత్తి కేంద్రంపై దృష్టి సారించాలని  పలువురు కోరుతున్నారు.
 
విద్యుదుత్పత్తికి ‘వరద’ గండం
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్  మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడానికి వరద కాలువ  జల విద్యుదుత్పత్తికి గండంగా మారింది. కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్ జిల్లాలోని లోయార్ మానేరు డ్యాం నింపే అవకాశం ఉండగా, వరద కాలువ ద్వారానే నీటి విడుదల  చేపడుతున్నారు. దీంతో విద్యుదుత్పత్తికి  తీవ్ర నష్టం కలుగుతోంది. పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదు.

మరిన్ని వార్తలు