సాక్షి, దుండిగల్: ‘అందరి దృష్టిలో చెడ్డపేరు తెచ్చుకున్నాను. వాళ్ల మనసులో ఒక పిరికివాడిలా మిగిలిపోయాను.. అమ్మా.. నాన్నా.. నా వల్ల మీ అందరికీ నష్టం జరుగుతోంది. ఇకపై మీకు ఏ సమస్యా ఉండదు. నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఐ మిస్ యూ.. అండ్ ఐ లవ్ యూ. మామ్ అండ్ డాడ్’ అంటూ ఓ విద్యార్థి సుసైడ్ నోట్ రాసి అదృశ్యమయాడు. ఈ సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ టౌన్ సాయినగర్కు చెందిన చింతల లక్ష్మణ్ కుమారుడు చింతల సాయిగణేశ్ (17) బౌరంపేటలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. ఆదివారం హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన సాయిగణేశ్ తిరిగి రాకపోవడంతో నిర్వాహకులు అతని తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. హాస్టల్కు చేరుకున్న సాయిగణేశ్ తండ్రి చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. అదేరోజు రాత్రి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు అదృశ్యమయ్యాడని, హాస్టల్ నుంచి బయటకు వెళ్లినా పట్టించుకోలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు హాస్టల్లో ఉంటున్న సాయిగణేశ్ గదిని పరిశీలించారు. గదిలో గణేశ్ రాసిని సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి విద్యార్థి కోసం గాలింపులు చేస్తున్నారు.