తెలంగాణ హైకోర్టుకు జస్టిస్‌ శ్రీదేవి 

15 Apr, 2019 20:57 IST|Sakshi

తీర్మానం చేసిన సుప్రీంకోర్టు కొలీజియం  

సాక్షి, హైదరాబాద్‌: అలహాబాద్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్న తెలుగు మహిళ జస్టిస్‌ గండికోట శ్రీదేవిని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు గతవారం కొలీజియం తీర్మానం చేసింది. ఈ సిఫార్సు కార్యరూపం దాలిస్తే తెలంగాణ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా ఆమె ఖ్యాతి గడిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన జస్టిస్‌ శ్రీదేవి ఆలిండియా కోటాలో 2005లో ఉత్తరప్రదేశ్‌ జ్యుడీషియల్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. 2016లో జిల్లా, సెషన్స్‌ జడ్జిగా పదో న్నతి పొందారు.

అలాగే వివిధ హోదాల్లో పనిచేశారు. ఘజియాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో అలహాబాద్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆమె అలహాబాద్‌ హైకోర్టు సీజే ద్వారా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు కొలీజియం, ఆమెను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించి ఆ మేర కేంద్రానికి సిఫార్సు చేసింది.

మరిన్ని వార్తలు