50షేడ్స్‌

5 Dec, 2019 11:25 IST|Sakshi
ఎన్టీఆర్‌తో పిల్లుట్ల లక్ష్మీకాంత్‌శర్మ..

ఆధునిక యుగంలోనూ నాటకాలకు జీవం

50 రకాల పాత్రలు..వేషధారణల్లో దిట్ట

తనదైన శైలితో రాణిస్తున్న పిల్లుట్ల

వందలకొద్దీ ప్రదర్శనలతో ప్రశంసలు.. అవార్డులు

40 ఏళ్లుగా రంగస్థలంపై ఆయనే రారాజు

వేషం వేస్తే అదుర్స్‌...నాయక, ప్రతినాయక పాత్రలకు ఆయనకు ఆయనే సాటి. ఆ నటనలో నవరస ప్రవాహాలు పరవళ్లు తొక్కుతాయి. సుస్పష్ట వాచకం, అనర్గళ సంభాషణా చాతుర్యం కలబోసిన శబ్దాలయం ఆయన సుస్వరం. చిన్నప్పటి నుంచి సాంఘిక, పౌరాణిక, నాటక రంగం అంటే ఎంతో ఆసక్తిని పెంచుకున్న ఆయన...50 రకాల వేషధారణలతో ఆ పాత్రలకు జీవం పోశారు. ధీర గంభీర రూపం,  సవినయ భావ భంగిమలు, ఇత్యాది నట లక్షణాలతో ప్రేక్షకులను ఆనందరస తరంగ డోలికలలో ఓలలాడిస్తారు. ఆయనే ప్రముఖ రంగస్థల కళాకారుడు డాక్టర్‌ పిల్లుట్ల లక్ష్మీకాంత్‌శర్మ. వృత్తిరీత్యా నాచారంలోని భారత ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగిగా పని చేస్తూనే మరోవైపు నటనను ప్రవృత్తిగా మలచుకుని ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు. గత 40 ఏళ్లుగా రంగస్థలంపై ప్రదర్శనలు ఇస్తూ నేడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాణిస్తూ ఎందరో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

సనత్‌నగర్‌: డాక్టర్‌ పిల్లుట్ల లక్ష్మీకాంతశర్మ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి పరిధిలోని వల్లభాపురం. రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయుక్త, రచయిత అయిన పొలమరశెట్టి ఫ్రాన్సిస్‌ స్ఫూర్తితో ఆయన రంగస్థలం వేదిక వైపు అడుగులు వేశారు. ఆయన శిష్యునిగా ఓనమాలు దిద్ది ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. నాటకరంగంపై ఆనాడు ఏర్పడ్డ అభిలాష ఇంతింతై వటుడింతై అన్నట్లుగా జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి ఎందరో మహామహుల ప్రశంసలను అందుకున్నారు. కృషి, పట్టుదల, విషయ పరిజ్ఞానం, తన శారీర సౌష్టవానికి ఏ పాత్ర సరిపోతుందో ఆ పాత్రను ఎన్నుకోవడం, సంగీత దర్శకుని సలహా తూ.చ తప్పకుండా పాటిస్తూ క్రమశిక్షణతో నటిస్తున్నారు డాక్టర్‌ పిల్లుట్ల. నాటక రంగంలో తాను నేర్చుకున్న అనుభవాన్ని జోడిస్తూ నిరంతరం సాధన సంపత్తులతో పలు పద్య, సాంఘిక, పౌరాణిక, జానపద, టీవీ సీరియల్స్, సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అయిన అకాడమీ ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ సంస్థ నాటక రంగంలో ఆయన సేవలను గుర్తించి బెంగుళూరులో డాక్టరేట్‌ ప్రదానం చేసింది. 

500 ప్రదర్శనలు... 50 పాత్రలు
డాక్టర్‌ పిల్లుట్ల ఏ వేషం వేస్తే ఆ పాత్రకు జీవం పోసినట్లేనని ప్రేక్షకులు చెప్పేమాట. తన నటనా కౌశలంతో ప్రేక్షకులను రంజింపజేయడమే కాదు..ఆ పాత్ర హుందాతనానికి తగ్గట్టుగా హావభావాలు పలికించడంలో మేటిగా ఎదిగారు. ఇప్పటివరకు సుమారు 500 ప్రదర్శనల్లో 50 రకాల వేషాలు వేసి రంగస్థల ప్రేమికుల మదిని దోచుకున్నారు. రంగస్థలం మీదనే కాకుండా సినిమా, సీరియల్స్‌లోను తనకు అందివచ్చిన పాత్రలకు న్యాయం చేసి డైరెక్టర్, నిర్మాతల ప్రశంసలనూ అందుకున్నారు. ప్రముఖ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్‌ రచనలో కోకా విజయలక్ష్మి దర్శకత్వంలో ‘తెలుగు ప్రశస్తి’ విశిష్ట సంగీత నృత్యరూపకంలో శ్రీకృష్ణదేవరాయులు, గౌతమిపుత్ర శాతకర్ణిగా ద్విపాత్రాభినయం చేసి రక్తి కట్టించారు. ‘పాండవోద్యోగ విజయం’ నాటకంలో ధుర్యోధనుడు, బలరాముడు, కర్ణుడు, దుశ్శాసనుడి పాత్రలు, శ్రీవెంకటేశ్వర మహత్త్యంలో భృగమహర్షి, ఆకాశరాజుల పాత్రలు, సత్య హరిశ్చంద్ర నాటకం (కాటిసీన్‌)లో హరిశ్చంద్రుడి పాత్రల్లో ఒదిగిపోయారు. అదేవిధంగా బోయి భీమన్న రచనలో వచ్చిన ధర్మవ్యాధుడు నాటకంలో మహర్షిగా,ప్రసన్నయాదవంలో నరకాసురుడిగా, రుక్మిణీ కళ్యాణంలో శిశుపాలుడుగా, కాళహస్తీశ్వర సాయుజ్యంలో కిరాతుడు, శివుడి పాత్రలను, పార్వతీదేవి ఇల్లు కట్టిందిలో రావణాసురుడుగా, హిమవన్నగ దర్శనంలో చిత్రభానుడుగా, ఆంధ్ర కళా వైభవంలో తానీషాగా పాత్రధారణ చేసి ఔరా అన్పించారు. ఇవే కాకుండా వివిధ నాటకాలు, సినిమాల్లో భీముడు, విశ్వామిత్రుడు, శార్ధూరుడు, యమధర్మరాజు, బడే సాహెబ్‌ పాత్రలు వేశారు.
నాటకాలు, సినిమాల పాత్రలే కాకుండా జానపద కళగా పేరొందిన బుర్రకథలో సైతం తన ప్రతిభను చాటుతున్నారు పిల్లుట్ల. పల్నాటి యుద్ధం, కొము రంభీం వంటి చారిత్రాక గాథలను బుర్రకథ కళా రూపంలో తీసుకువచ్చి నేటి తరానికి సందేశం అందించారు.   
నేటి తరానికి పద్యం అంటే తెలియని పరిస్థితి. ఆ పద్యం విలువను డాక్టర్‌ పిల్లుట్ల తెలియజేస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు. ఎంతటి పెద్ద పద్యమైనా అనర్గళంగా తనదైన శైలిలో ప్రదర్శించి శ్రోతల మదిని దోచుకుంటున్నారు.

కొత్త తరానికి వారధి వేస్తున్నా...
పూర్వకాలంలో ఒక నాటకం వేస్తే ఎంతో అంకితభావంతో ప్రదర్శించేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండాపోయింది. పాతతరానికి, కొత్త తరానికి మధ్య వారధిగా నిలుస్తూ ఇప్పటి తరానికి నాటక రంగం గురించి తెలియజేసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నా. ప్రభుత్వం కూడా నాటక రంగానికి ప్రాధాన్యతనిచ్చి కళాకారులను ప్రోత్సహిస్తే బాగుంటుంది.– డాక్టర్‌ పిల్లుట్లలక్ష్మీకాంతశర్మ

మరిన్ని వార్తలు