టెన్త్ పరీక్షలు ప్రారంభం

28 Mar, 2014 01:08 IST|Sakshi

నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 250 సెంటర్లలో తెలుగు-1 (జనరల్, కాంపోజిట్) సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు. దీనికి 50839 మంది విద్యార్థులు అలాట్‌కాగా 50290 మంది పరీక్ష రాశారు. 549 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల రాష్ట్ర పరిశీలకుడు నజీమొద్దీన్ 9 సెంటర్లలో, డీఈఓ మదన్‌మోహన్ 6 సెంటర్లలో తనిఖీ చేశారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు 80 సెంటర్లలో తనిఖీలు నిర్వహించాయి. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు.

 రిలీవ్ ఉండదు... ఏకంగా సస్పెన్షనే

 పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఎక్కువగా మాల్‌ప్రాక్టీస్ కేసులు బుక్‌కావడం లాంటి విషయాల్లో ఇన్విజిలేటర్లను రిలీవ్ చేసే విధానం ఇకపై ఉండదు. ఇన్విజిలేషన్ విధుల పట్ల ఆసక్తిలేని వారు ఉద్దేశపూర్వకంగా పొరపాట్లు చేసి డ్యూటీ నుంచి రిలీవ్ అవుతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తుండడంతో ఈ ఏడాది ప్రభుత్వం కొత్త నిబంధన విధించింది. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే ఇన్విజిలేటర్లకు ఉన్నతాధికారులు మెమో జారీ చేస్తారు. వివరణ తీసుకుంటారు. సంతృప్తికరమైన కారణం లేకపోతే సస్పెన్షన్ వేటు వేసేస్థాయిలో చర్యలుంటాయని తెలిసింది.

 పరీక్షకు హాజరైన అంధవిద్యార్థులు

 నల్లగొండలోని అంధుల పాఠశాలకు చెందిన 20 మంది విద్యార్థులు స్క్రైబ్ (సహాయకుడు)తో పరీక్షకు హాజరయ్యారు. వారందరికీ విశ్వదీప్ పాఠశాల కేంద్రాన్ని కేటాయించారు. ఒకే పాఠశాల నుంచి 20 మంది అంధ విద్యార్థులు టెన్‌‌తపరీక్షలకు హాజరుకావడం రాష్ట్రంలో ఇదే ప్రథమం.

 గేట్లు తెరవని అధికారులు

 10వ తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 8.45 గంటలకే చేరుకోవాలని అధికారులు ఆదేశించడంతో విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే చేరుకున్నారు. కానీ చాలా సెంటర్లలో 9 గంటల వరకు ఆయా పాఠశాలల గేట్లు తెరవకపోవడంతో విద్యార్థులు రోడ్లపైనే వేచి చూడాల్సి వచ్చింది. తమ ఆదేశాలను ఆయా పరీక్ష కేంద్రాల నిర్వాహకులు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని ఉన్నతాధికారులు మర్చిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.

మరిన్ని వార్తలు