రాష్ట్రాన్ని కళలకు కేంద్రంగా మారుస్తాం

18 Feb, 2019 02:02 IST|Sakshi
కార్యాలయం ప్రారంభోత్సవంలో లక్ష్మారెడ్డి, శివకుమార్, హరికృష్ణ తదితరులు

తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ శివకుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ నమ్మకంతో తనకు సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నూతన తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ బి.శివకుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలోని కళాభవన్‌లో భాషా సాంస్కృతిక శాఖ కార్యాలయం పైఅంతస్తులో ఏర్పాటుచేసిన తెలంగాణ సంగీత నాటక అకాడమీ కార్యాలయాన్ని మాజీ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. శివకుమార్‌ మాట్లాడుతూ.. తెలంగాణ నాటక, సంగీత కళలకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేందుకు అహోరాత్రులు శ్రమిస్తానని తెలిపారు. గ్రామాల్లో చాలా మంది కళాకారులు ఉన్నారని.. వారికి రవీంద్రభారతి లాంటి వేదికపై ప్రదర్శనలు ఇచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పారు.

తెలంగాణను కళలకు కేంద్రంగా మారుస్తామని హామీఇచ్చారు. జీవితాంతం కళలకు సేవ చేస్తానని.. తెలంగాణ సంగీత నాటక అకాడమీకి పేరు తెస్తానని తెలిపారు. పేద కళాకారులకు నాటక అభినయం ఉన్నవారికి చేయూత ఇస్తామని చెప్పారు. కళాకారులకు ఆర్థిక సాయం, పల్లె కళాకారులకు రవీంద్రభారతిలో ప్రదర్శనలు ఇవ్వడానికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్, సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు