నేడు కలెక్టరేట్ల ఎదుట టీజేఎస్‌ దీక్షలు

23 Jul, 2018 03:13 IST|Sakshi

రైతుల భూమిపై హక్కుల కోసం పోరాడుతాం

సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్త ఉద్యమం

టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం

కాజీపేట అర్బన్‌/భూపాలపల్లి రూరల్‌: భూములపై రైతుల హక్కు కోసం రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట సోమవారం రైతు దీక్షలు చేపట్టనున్నట్లు తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫె సర్‌ కోదండరాం తెలిపారు. హన్మకొండలో ఆదివారం ఆయన టీజేఎస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనతో అనేకమంది రైతులు భూమిపై హక్కులను కోల్పోయారని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 9,11,241 రెవెన్యూ రికార్డుల్లో తప్పులు దొర్లాయని, ఫలితంగా జరిగిన ఐదుగురు రైతుల మరణానికి ప్రభుత్వం జవాబు చెప్పాలని ఆయన నిలదీశారు. వెంటనే ప్రభుత్వం రెవెన్యూ రికార్డులను సరిచేసి రైతులకు భూమిపై హక్కులను కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎల్కతుర్తి మండలంలో రెవెన్యూ అధికారులు చేసిన తప్పులను ప్రశ్నించినందుకు రైతుపై దాడి చేసి కేసులు బనాయించడం దారుణమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 శాతం మంది రైతులకు పట్టాదారు పాసు బుక్కులు రాలేదని, వారికి పాస్‌బుక్కులు అందని పక్షంలో సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వస్తామని ఆయన హెచ్చరించారు.  

అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయిందని కోదండరాం విమర్శించారు. భూపాలపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీ భూపాలపల్లి జిల్లా  సమావేశంలో మాట్లాడుతూ రైతుబంధు పథకం వల్ల భూస్వాములకే ప్రయోజనం చేకూరిందని, చిన్న, సన్నకారు రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు.

మరిన్ని వార్తలు