సిటీ శివార్లకు  ఆర్టీసీ దూరం..

31 Jan, 2020 04:22 IST|Sakshi

దాదాపు 250 గ్రామాలకు భారీగా సర్వీసులు నిలిపివేత

ఖర్చు తగ్గించే పేరుతో బస్సుల రద్దు

అద్దె బస్సులకే సేవలు పరిమితం 

నగర మార్కెట్లు, రైతుబజార్లకు ఆ గ్రామాల నుంచి

భారీగా కూరగాయల సరఫరా

ఇంతకాలం రైతులకు బస్సులే ఆసరా 

ఇప్పుడు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సిందే 

భారీగా పెరిగిన ఆటోలు, జీపుల సంఖ్య.. ఒక్కసారిగా భగ్గుమన్న వాటి ఛార్జీ  

సాక్షి, హైదరాబాద్‌: ఇబ్రహీంపట్నానికి 16 కి.మీ. దూరంలో ఉన్న ఆరుట్ల సహా మంచాల, జాపాల్‌ తదితర గ్రామాల్లో కూరగాయల సాగు ఎక్కువ. రైతులు తమ పంటను ఆర్టీసీ బస్సుల ద్వారా నగరంలోని మాదన్నపేట మార్కెట్, ఎనీ్టఆర్‌ నగర్‌లోని రైతు బజార్‌కు తరలించేవారు. ఈ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారి సంఖ్యా ఎక్కువే. వీరికి ఆర్టీసీ బస్సులు ఎంతో ఉపయుక్తంగా ఉండేవి. కానీ ఆర్టీసీ సమ్మె తర్వాత సీన్‌ మారిపోయింది. నష్టాలకు కళ్లెం వేసే పేరుతో అధికారులు ఇలాంటి గ్రామాలకు ఉన్న బస్సులను దాదాపు నిలిపివేశారు. ఆర్టీసీలోని కొన్ని అద్దె బస్సులు తప్ప సొంత బస్సులను బాగా తగ్గించేశారు. దీంతో రైతులు, ఇతర ప్రయాణి కులు ఆటోల్లో ఇబ్రహీంపట్నం వరకు వచ్చి, అక్కడి నుంచి బస్సులెక్కాల్సి వస్తోంది. ఇది ఈ ఒక్క ప్రాంతంలోని గ్రామాల కథే కాదు. నగరం చుట్టూ 30 కి.మీ. పరిధిలో విస్తరించిన దాదాపు 250 గ్రామాల వ్యథ.

 ఆటోలు, జీపులమయం.. 
రెండు దశాబ్దాల క్రితం నగరం నుంచి సిటీ బస్సులు శివారు గ్రామాలకు తప్ప అంతకుమించి ముందుకు వెళ్లేవి కాదు. కానీ, సిటీ విస్తరిస్తుండటంతో 30–40 కి.మీ. దూరంలో ఉన్న గ్రామాల ప్రజలు నిత్యం నగరానికి రాకపోకలు సాగిస్తుండటంతో క్రమంగా అంత పరిధిలో విస్తరించిన ఊళ్లకూ సిటీ బస్సు సర్వీసులు మొదలయ్యాయి.ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఉప్పల్, రాజేంద్రనగర్, కుషాయిగూడ, మిధాని, చెంగిచెర్ల, మేడ్చల్, మెహిదీపట్నం తదితర డిపోల నుంచి నగరం చుట్టూ ఉన్న గ్రామాలకు వందల సంఖ్యలో బస్సులు తిరిగేవి. సమ్మె తర్వాత ఖర్చుల నియంత్రణ పేరుతో అధికారులు భారీగా బస్సులు తగ్గించారు. ఒక్క హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోనే దాదాపు వెయ్యి బస్సులు తొలగించారు. ఇదే సమస్యకు కారణమైంది. నగరానికి కాస్త దూరంగా ఉన్న గ్రామాలకు నడుస్తున్న బస్సుల్లో సింహభాగం తొలగించేశారు.

సిటీకి 40 కి.మీ. పరిధిలో ఉన్న ఊళ్లలో ఎక్కువగా కూరగాయల సాగు ఉంది. వాటిని నగరంలోని రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లకు తరలిస్తారు. పెద్ద రైతులు ప్రైవేటు వాహనాలను ఎంగేజ్‌ చేసుకోగా, చిన్న రైతులు ఆర్టీసీ బస్సులనే నమ్ముకున్నారు. వారి కోసం ప్రత్యేకంగా రైతుబజార్ల వేళలకు సరిపడే సమయాల్లో సరీ్వసులు నడిపేది. ఇప్పుడు బస్సులు రద్దు కావడంతో వారు గత్యంతరం లేక ఆటోలను ఆశ్రయిస్తున్నారు. సాధారణ ప్రజలూ ఆటోలు, జీపులపై ఆధారపడాల్సి వచి్చంది. ఇప్పుడు ఒక్కసారిగా వాటిసంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. బస్సులున్నప్పుడు ఆర్టీసీ ఛార్జీలకు దాదాపు సమంగా వీరు వసూలు చేసేవారు. ఇక బస్సుల్లేవని తేలిపోవటంతో ఒక్కసారిగా రేట్లను పెంచేశారు. ఇలాగే ఉంటే భవిష్యత్తులో వాటి వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇదీ కారణం.. 
నగరం నుంచి గ్రామాలకు తిప్పుతున్న ఆర్టీసీ బస్సులకు కి.మీ.కు నిర్వహణ వ్యయం రూ.55గా ఉంటోందని ఆర్టీసీ లెక్కలు తేలి్చంది. కానీ ఆదాయం రూ.35 లోపే ఉంటోంది. అంటే కి.మీ.కు రూ.20కి పైగా నష్టం వస్తోందని అంటోంది. ఇందులో సిబ్బంది జీతాల వాటా రూ.27 దాకా అవుతోంది. డీజిల్‌ రూ.18గా ఉంది. మిగతాది ఇతర నిర్వహణ వ్యయం.  

గ్రామీణాభివృద్ధిలో బస్సు.. 
గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజా రవాణాతో అనుసంధానమై ఉండటం కూడా ముఖ్యం. నగరానికి చేరువగా ఉన్న వాటికి ఇది మరింత కీలకం. ఇప్పుడు దాన్ని చెరిపేసినట్లయింది. గ్రామీణాభివృద్ధి నిధుల నుంచి నష్టాన్ని భర్తీ చేయాలనే వాదన చాలా కాలంగా ఉంది. మెట్రో రైలుకు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ఇచి్చనట్లుగానే ఆర్టీసీ గ్రామీణ సరీ్వసులకు కూడా ఇవ్వాలన్న సిఫారసు ఉంది. డీజిల్‌పై పన్ను తగ్గించడం ద్వారా గానీ.. సిటీ ఆపరేషన్స్‌ రెవెన్యూలో 5 శాతం, జిల్లా రెవెన్యూలో 7 శాతం చొప్పున వసూలు చేస్తున్న మోటారు వాహన పన్నులో కొంత మినహాయింపు ఇవ్వడం ద్వారా గానీ ఈ సాయం చేయాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

మొత్తం సర్వీసులు రద్దు దిశగా..
అద్దె బస్సుల్లో సిబ్బంది జీతాల భారం చాలా తక్కువగా ఉండటం, కండక్టర్‌ జీతాన్ని ఆరీ్టసీనే భరిస్తుండటంతో అద్దె బస్సుల నిర్వహణ వ్యయం తక్కువగా ఉండి వాటిని నడపగలుగుతున్నారు. క్రమంగా ఆర్టీసీ తన మొత్తం గ్రామీణ సరీ్వసులను రద్దు చేసే దిశగా యోచిస్తోంది. బస్సుల రద్దుతో మిగిలిన కండక్టర్లను బదిలీ చేస్తున్నారు. తాజాగా ఒక్క ఇబ్రహీంపట్నం డిపో పరిధిలోనే 25 మంది కండక్టర్లు దూర ప్రాంతాల డిపోలకు బదిలీ అయ్యారు. ఇందులో మహిళా కండక్టర్లను దూరంగా ఉన్న హెచ్‌సీయూ డిపోకు మార్చారు. అంత దూరం వెళ్లి రావడానికి వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది.    

మరిన్ని వార్తలు