విద్యార్థిని బలిగొన్న ప్రేమ వ్యవహారం

21 Feb, 2018 15:05 IST|Sakshi
ప్రశాంత్‌ (ఫైల్‌)

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య 

నార్లాపూర్‌లో స్కూల్‌లో ఉరి వేసుకొని బలవన్మరణం

ప్రాణం మీదికి తెచ్చిన మెస్సేజ్‌

గ్రామంలో విషాద ఛాయలు 

రామాయంపేట, నిజాంపేట(మెదక్‌): తెలిసీ తెలియని వయస్సులో ప్రేమ వ్యవహారం ఒక విద్యార్థి ప్రాణాలను బలిగొంది. పోలీసులు,  కుటుంబీకుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. నిజాంపేట మండలం నార్లాపూర్‌కు చెందిన కైరంకొండ అనసూయకు ఇద్దరు కుమారులు ప్రశాంత్‌(18), నాగరాజు ఉన్నారు. ఆమె భర్త  గతంలో చనిపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ తన పిల్లలను పోషిస్తోంది. వారికి స్వంత ఇల్లుతోపాటు వ్యవసాయ భూమి లేదు. దీంతో ప్రభుత్వ స్థలంలో గుడిసె వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే రామాయంపేటలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న ప్రశాంత్‌ కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన ఒక విద్యార్థినిని ప్రేమిస్తున్నాడు.

నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఇటీవల ప్రశాంత్‌ సదరు బాలికకు మేస్సేజ్‌ పంపాడు. దీంతో బాలిక ఆ విషయాన్ని తన తల్లికి చెప్పంది. బాలిక తల్లి ప్రశాంత్‌ తల్లి దృష్టికి తీసుకెళ్లింది. విషయం తెలుసుకున్న ప్రశాంత్‌ శనివారం తన ఇంటినుంచి వెళ్లి బంధువుల ఇంటికి చేరుకున్నాడు. సోమవారం తిరిగి స్వగ్రామానికి వచ్చిన ప్రశాంత్‌ రాత్రి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో చున్నీతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం మృతదేహాన్ని ఆటో డ్రైవర్లు చూసి విషయాన్ని మృతుడి తల్లికి తెలిపారు. మృతుడి కుటుంబీకులు, బంధువుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ప్రశాంత్‌ ఉరి వేసుకున్న చున్నీ ఎవరిదో అంతుబట్టడం లేదు. అతడి తండ్రి సైతం 11ఏళ్ల క్రితం ఉరివేసుకుని మృతి చెందడం యాథృచ్ఛికం. నిజాంపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు