ఇన్ఫోసిస్‌లో జాబొచ్చింది కానీ అంతలోనే..

17 Nov, 2019 11:23 IST|Sakshi

సాక్షి, మెదక్‌ రూరల్‌: డెంగీతో యువ ఇంజినీర్‌ మృతి చెందిన సంఘటన హవేళిఘనాపూర్‌ మండలం నాగాపూర్‌ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన ఒంటరి నరేందర్‌రెడ్డి, మంజుల కుమార్తె భవ్య(21) నర్సాపూర్‌ బీవిఆర్‌ఐటీ కళాశాలలో ఇంజనీరింగ్‌ సీఎస్‌సీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతుంది. భవ్యకు ఐదు రోజులు క్రితం డెంగీ జ్వరం సోకడంతో అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు మెదక్‌ ఆసుపత్రిలో చికిత్స  చేయించి మెరుగగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని రష్‌ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ పరిస్థితి విషమించడంతో యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. ఎంతో ఖర్చుతో చికిత్స చేయించినప్పటికీ భవ్య మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. భవ్య ఇటీవల క్యాంపస్‌లో నిర్వహించిన సెలక్షన్‌లో ఇన్ఫోసిస్‌ ఉద్యోగానికి నియామకమై ఉద్యోగంలో చేరకముందే మృత్యువు ఒడికి చేరడంతో  కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. శనివారం సాయంత్రం భవ్య అంత్యక్రియలు స్వగ్రామమైన నాగాపూర్‌లో నిర్వహించారు.  

మరిన్ని వార్తలు