రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి

20 Apr, 2019 11:48 IST|Sakshi

బీబీనగర్‌ (భువనగిరి) : బంధువుల జన్మదిన వేడుకలకు వెళ్తున్న ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.ఈ ఘటన శుక్రవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అదిలాబాద్‌ జిల్లాకు చెందిన మునెసూల అరుణ(21) హైదరాబాద్‌ నాంపల్లిలోని ఓహస్టల్‌లో ఉంటూ ఎస్‌ఎన్‌ వనిత మహావిద్యాలయ్‌ డిగ్రీ కళాశాలలో బీఎస్‌ఈ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా యాదాద్రి(గుట్ట)లోని తమ అక్క కూతురి జన్మదినం కావడంతో అరుణ తన బంధువు  ముషీరాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌తో కలిసి స్కూటీపై హైదరాబాద్‌ నుంచి బయలుదేరి వచ్చారు. బీబీనగర్‌లోని చెరువు కట్ట సమీంపలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న బ్రీజా కారు స్కూటీని ఢీకొట్టి వెళ్లిపొయింది.

దీంతో రోడ్డుపై ఎగిరి పడ్డ అరుణపై నుంచి అదే సమయంలో వెనుక నుంచి మరోకారు దూసుకుపోయింది. ఈసంఘటనలో అరుణ అక్కడికక్కడే మృతి చెందగా రోడ్డు పక్కన పడ్డ శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి.  మొదట ప్రమాదానికి కారణమైన బ్రీజా కారు అక్కడి నుంచి తప్పించుకు పోగా అరుణ మృతికి కారణమైన హైదరాబాద్‌కు చెందిన కారును, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అరుణతో కలిసి వచ్చిన శ్రీకాంత్‌ అరుణ తన స్నేహితురాలు అంటూ స్థానికులతో చెప్పుకొచ్చాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు