ఆధార్‌ లింకేజీతో అగచాట్లు   

24 May, 2018 12:51 IST|Sakshi
తహసీల్‌ కార్యాలయం ఆవరణలో ఆదాయ ధ్రువీకరణ దరఖాస్తులు నింపుతున్న విద్యార్థినులు 

ఆదాయ ధ్రువీకరణ పత్రాలకోసం పడిగాపులు

అవగాహన లోపమే అసలు కారణం

మందకొడిగా డిగ్రీ అడ్మిషన్లు

ఈనెల 26తో ముగియనున్న గడువు

పొడిగించాలంటున్నవిద్యార్థి సంఘాలు

సిరిసిల్లకల్చరల్‌ : ఆన్‌లైన్‌లో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన దోస్త్‌ వెబ్‌సైట్‌ ఈ సారి మరింత çకఠినతరంగా మారింది. పకడ్బందీగా రూపొందించిన వెబ్‌సైట్‌లో డిగ్రీలో ప్రవేశం కోరే విద్యార్థికి నిర్దిష్ట మొబైల్‌ నంబర్‌ ఉండాలి. అది కచ్చితంగా అదే విద్యార్థి ఆధార్‌కార్డు నంబర్‌తో లింకు అయి ఉండాలి. ఈ నిబంధనే ప్రధాన సమస్యగా పరిణమించింది.

అడ్మిషన్ల ప్రక్రియను ఆలస్యం చేస్తోంది. అవగాహన లేమితో చాలా మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు తమ మొబైల్‌ నంబర్‌తో ఆధార్‌ నంబర్‌తో సీడింగ్‌ చేయించుకోలేదు. ఈ విషయం అంత సీరియస్‌గా పట్టించుకోక పోవడంతో అడ్మిషన్ల ప్రక్రియకు ప్రధాన ఆటంకంగా మారింది. ఈ కారణాలతో అడ్మిషన్ల ప్రక్రియ మందగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల దరఖాస్తుల కన్నా మించలేదని సమాచారం.

ఆధార్‌ కేంద్రంలోనూ అవస్థలే..

ప్రతి విద్యార్థి మొబైల్‌ నంబర్‌కు ఆధార్‌ నంబర్‌ను సీడ్‌ చేయించుకునే నిమిత్తం ఆధార్‌ సేవా కేంద్రాలతో పాటు ఈ సేవ, మీసేవ కేంద్రాలకు అవకాశం కల్పించారు. అయితే వీటిలోనూ సేవాలోపాలున్నాయి. ఆధార్‌ సేవా కేంద్రాల్లో రోజుకు 50 మంది కార్డుల సవరణకే వీలు కల్పిస్తున్నారు.

మిగిలిన ఈ సేవ, మీ సేవ కేంద్రాల్లో చాలా వరకు సర్వర్‌ సమస్యలు, సిగ్నల్‌ సమస్యలతో సతమతమవుతున్నాయి. ఒకవేళ అవకాశం దొరికినా సంబంధిత ప్రక్రియ ముగిసేందుకు కనీసం 72 గంటల సమయం పడుతోంది. ఒక్కోసారి ఈ సమయం వారం దాకా కొనసాగుతోంది.

ముగియనున్న గడువు

డిగ్రీ అడ్మిషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 8న ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. ఒకే రిజిస్ట్రేషన్‌తో రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాల పరి«ధిలోని ఏ కళాశాలలోనైనా ప్రవేశం పొందేలా వెసులుబాటు కల్పించింది. ఆధార్‌ నంబర్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌తో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించడంతో పాటు కావాలనుకున్న కళాశాలలో సీటుకోసం ఆప్షన్లు ఇచ్చుకునేలా సైట్‌ను రూపొందించింది.

రిజిస్ట్రేషన్‌ రుసుము రూ. 200గా నిర్ణయించింది. తొలి దశ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 26తో ముగియనుంది. రూ. 400 మరో మూడురోజులపాటు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. దీంతో చాలా మంది అడ్మిషన్లు గడువు లోగా ముగిసేలా కనిపించడం లేదు. 

ఆదాయ ధ్రువీకరణ పత్రాలకోసం..

ఈసారి డిగ్రీ ప్రవేశ దరఖాస్తుతో పాటు స్కాలర్‌షిప్‌ దరఖాస్తును కూడా ముడి పెట్టారు. ఫీజు రి యింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ను ఆశించే ప్రతి వి ద్యార్థి వి«ధిగా మీ సేవ కేంద్రాలనుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొంది ఉండాలి. కాగా అంతకుముందు ప్రతి దరఖాస్తును సంబం«ధిత వీఆ ర్వో, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రాల జారీ కోసం సిఫారస్‌ చేయాల్సి ఉంటుం ది.

డిగ్రీ ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై న రోజునే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు ప థకం కూడా ప్రారంభమైంది. ఈ కారణంగా రె వెన్యూ అధికారులంతా ఆ దిశగా బిజీగా ఉండిపోయారు. వీఆర్వో స్థాయి నుంచి డీఆర్వో స్థాయి అ« దికారులంతా చెక్కుల పంపిణీలో తల మునకలై ఉండడంతో విద్యార్థులను పట్టించుకునే వారు క రువయ్యారు. దీంతో సమీప గ్రామాల విద్యార్థులు దరఖాస్తులు పట్టుకుని తహసీల్దార్‌ కార్యాల యం పరిసరాల్లో ఎదురు చూపులు చూస్తున్నారు.

గడువు పెంచడమే శరణ్యం

వివిధ కారణాలతో డిగ్రీ ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మందగించిన మేరకు దరఖాస్తు చేసుకునే గడువు పెంచడమే శరణ్యంగా పలు విద్యార్థి సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఆన్‌లైన్‌ ప్రక్రియ కోసం అనుసరించాల్సిన వి«ధివిధానాలపై జూనియర్‌ కాలేజ్‌ స్థాయిలో విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తకపోయేది.

ఆధార్‌ కార్డు లింకేజ్‌తో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు గడువు పెంచడమే అనివార్యంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే కామన్‌ అకడమిక్‌ కేలండర్‌లో కూడా మార్పులు జరిగే పరిస్థితులూ ఏర్పడవచ్చు.  

మరిన్ని వార్తలు