గీత దాటిన సబ్‌ జైలర్‌

2 Aug, 2019 11:05 IST|Sakshi
సబ్‌జైలర్‌ సుధాకర్‌రెడ్డి

సాక్షి, కల్వకుర్తి(నాగర్‌కర్నూల్‌) : విధుల పట్ల నిర్లక్ష్యం, అక్రమార్కులతో కుమ్మక్కు, తోటి ఉద్యోగుల పట్ల దురుసు ప్రవర్తన వెరసి కల్వకుర్తి సబ్‌జైలర్‌ సుధాకర్‌రెడ్డిపై వేటుకు కారణమైంది. కల్వకుర్తి సబ్‌ జైలర్‌గా మంథని నుంచి సుధాకర్‌రెడ్డి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి విధుల పట్ల అంటిముట్టనట్లుగా ఉన్న ఈయన సబ్‌జైలర్‌ నుంచి ఎస్‌ఐగా మారి తన పరిధి దాటి ఇసుక అక్రమార్కుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఎస్‌ఐ అవతారం ఎత్తి.. 
సబ్‌ జైలర్‌గా విధులు నిర్వహించాల్సిన సుధాకర్‌రెడ్డి దారితప్పి ఎస్‌ఐగా అవతారం ఎత్తి ఇసుక అక్రమార్కుల దగ్గర అక్రమంగా వసూళ్లకు పాల్పడుతూ దందా నిర్వహిస్తున్నారు. కొంతమంది సిబ్బందిని తన అక్రమాలకు అండగా ఉపయోగించుకుంటున్నారు. డబ్బులు ఇవ్వని ఇసుక వ్యాపారు లకు ఫోన్లు చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే ఇసుక ట్రా క్టర్లు సీజ్‌ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. 

ఉన్నతాధికారులకు ఫిర్యాదు 
సబ్‌ జైలర్‌ సుధాకర్‌రెడ్డి మంథనిలో విధులు నిర్వహించిన సమయంలో అనేక ఆరోపణలు రావడంతో కల్వకుర్తికి బదిలీ చేశా రు. ఇక్కడ కూడా విధులు నిర్వహిస్తూ ఒక ఇసుక వ్యాపారిని డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధిత వ్యా పారి సబ్‌జైలర్‌ ఫోన్‌కాల్‌ను రికార్డు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో రెండు రోజుల క్రితం కల్వకుర్తికి వచ్చి సమగ్ర విచారణ జరిపారు.

సుధాకర్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతోపాటు విధుల పట్ల నిర్లక్ష్యాన్ని గుర్తించిన అధికారుల నివేదిక మేరకు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ప్రిసన్స్‌ సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేయడంతోపాటు సుధాకర్‌రెడ్డిని హెడ్‌క్వార్టర్‌ వదిలి పోకూడదనే ఆదేశాలిచ్చారు. సబ్‌ జైలర్‌ వ్యవహారం కల్వకుర్తి ప్రాంతంలో కలకలం రేకెత్తించింది.  

మరిన్ని వార్తలు