సినీతారల సందడి

5 Oct, 2014 23:54 IST|Sakshi

 సిద్దిపేట జోన్: లౌక్యం చిత్ర యూనిట్ విజయ యాత్ర ఆదివారం సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక వెంకటేశ్వర కళామందిర్ థియేటర్లో చిత్రం యూనిట్ సభ్యులు ప్రేక్షకులతో సందడి చేశారు. చిత్రం హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. తన చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులను అలరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని పేర్కొన్నారు. త్వరలో సినీ అభిమానులను రంజింపజేసేందుకు మరిన్ని కొత్త చిత్రాలు వస్తున్నాయని తెలిపారు.

 లౌక్యం సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు హీరో గోపీచంద్ చిత్ర యూనిట్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. విజయ యాత్రలో భాగంగా సిద్దిపేటకు రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేటకు జై అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. అంతకుముందు ప్రముఖ కమేడియన్ రఘు, చిత్రం నిర్మాత ఆనంద్ ప్రసాద్, డెరైక్టర్ శ్రీనివాస్, రచయిత కోన వెంకట్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడారు. హీరో గోపీచంద్, కమేడియన్ రఘుతో కరచాలనానికి ప్రేక్షకులు, అభిమానులు ఎగబడ్డారు.

అనంతరం యూనిట్ బృందం కరీంనగర్‌కు బయల్దేరింది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర కళామందిర్ థియేటర్ ప్రతినిధి రంగుల శ్రీనివాస్, ప్రముఖ వ్యాపార వేత్త కొమురవెళ్లి చంద్రశేఖర్, దూడం వేణు, బోనాల నర్సింలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిత్రం యూనిట్ సభ్యులు సిద్దిపేటకు వచ్చిన సందర్భంగా పట్టణ పోలీసులు థియేటర్ పరిసరాల్లో భారీ బందోబస్తును నిర్వహించారు.

మరిన్ని వార్తలు