ఎమ్మెల్సీగా సుఖేందర్‌రెడ్డి ప్రమాణం 

27 Aug, 2019 03:14 IST|Sakshi
గుత్తాకు పుష్పగుచ్ఛం ఇస్తున్న నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ్యుల కోటాలో శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలి సభ్యుడిగా ప్రమాణం చేశారు. సోమవారం మండలి ఆవరణలోని చైర్మన్‌ చాంబర్‌లో డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డితోపాటు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, కిషోర్, మల్లయ్య యాదవ్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు హాజరయ్యారు.

అనంతరం మండలి మీడియా పాయింట్‌ వద్ద భాస్కర్‌రావు, గొంగిడి సునీతతో కలసి గుత్తా విలేకరులతో మాట్లాడారు. తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ప్రజాసేవ కోసం సద్వినియోగం చేస్తానని, మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో నల్లగొండ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల జరిగిన మండలి ఎమ్మెల్యే కోటా ఉపఎన్నికలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన 2021 జూన్‌ 3వ తేదీ వరకు పదవిలో కొనసాగుతారు. 

మరిన్ని వార్తలు