పోలింగ్‌ రోజు రెండు గంటలు ఆలస్యంగా షూటింగ్‌కు వెళ్తాం

6 Nov, 2018 08:48 IST|Sakshi
సుమ, రాజీవ్‌ కనకాల

సాక్షి, బంజారాహిల్స్‌: ప్రజాస్వామ్యం మనకు ఒక గౌరవం, హక్కును కల్పించింది. అలాంటప్పుడు ఆలోచించి ఓటు వేయాలి. ఓటు వేయడం అవసరమా అనే భావన చాలా మందిలో ఉంటుంది. ఆ భావనను విడనాడాలి. ఓటు వేయకుంటే మనల్ని మనం మోసం చేసుకోవడంతో పాటు ఇతరులకు నష్టం చేసిన వారిగా మిగులుతాం. ఓటు అనేది హక్కు, ఆ హక్కును సరైన దారిలో వినియోగించుకోవాలి. గాలి, తిండి ఎలాగో మన భవిష్యత్తును నిర్ణయించే ఓటు కూడా అలాంటిదేనని అనుకోవాలి.

నేను, నా భర్త రాజీవ్‌ తప్పనిసరిగా ప్రతి ఎన్నికల్లోనూ ఓటు హక్కును వినియోగించుకుంటాం. ఆ రోజు షూటింగ్‌లు ఉన్నా రెండు గంటలు ఆలస్యంగా వెళతాం. ఎన్ని పనులున్నా ఓటు వేయనిదే షూటింగ్‌లకు హాజరయ్యే ప్రసక్తే లేదు. 20 ఏళ్ళ క్రితం రాజీవ్‌ కనకాల ఓటు వేయలేకపోయారు. ఓటు విలువ అప్పుడు అంతగా తెలియకపోవడంతో ఓటు వేయలేకపోయానని ఆ విలువ తెలిసిన తర్వాత తప్పనిసరిగా ఎన్నికల్లో పాల్గొంటున్నానని వెల్లడించారు. మేము జూబ్లీహిల్స్‌ నియోజక వర్గం పరిధిలో రాజీవ్‌నగర్‌లో ఉంటున్నాం. 
సుమ, రాజీవ్‌ కనకాల

జస్ట్‌ ఫర్‌ యు
పోలింగ్‌కు 48 గంటల ముందు బహిరంగ సమావేశాలు, పోలింగ్‌ స్టేషన్లకు వంద మీటర్లలోపు ప్రచారం నిషేధం.  
ప్రజల ఇళ్లముందు పికెటింగ్‌లు, ప్రదర్శనల వంటి వాటితో వారి ప్రశాంతతకు భంగం కలిగించరాదు.  
భవన యజమానుల అనుమతి లేనిదే పార్టీ జెండాలు, బ్యానర్లు గోడలపై రాతలు వంటివి చేయరాదు.  
పార్టీ సమావేశాలకు సంబంధించి సమయం, వేదిక తదితర వివరాలను తగినంత ముందుగా స్థానిక పోలీసులకు తెలియజేయాలి. తద్వారా ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా తదితర చర్యలు తీసుకుంటారు. ర్యాలీలు నిర్వహించేప్పుడు బయలు దేరే స్థలం.. ముగిసే స్థలం.. సమయం తెలియజేయాలి.  
సభలకు లౌడ్‌స్పీకర్లు, ఇతరత్రా సదుపాయాలు వినియోగించుకునేందుకు ముందస్తు అనుమతి పొందాలి.

మరిన్ని వార్తలు