వడగాడ్పుల డేంజర్ జోన్తో రాష్ట్రవ్యాప్తంగా భగభగ
పదుల సంఖ్యలో పిట్టల్లా రాలుతున్న జనం
ఎన్నడూలేనంతగా ఇప్పటికే 13 రోజులు.. వడగాడ్పు రోజులుగా నమోదు
మరో 20 రోజుల వరకు తీవ్రమైన వేడిగాలులు రికార్డయ్యే అవకాశం
రాష్ట్రంలో పలుచోట్ల 46 డిగ్రీలు నమోదు.. ఇది మరింత పెరిగే పరిస్థితి
నేడూ ఇదే వాతావరణం.. ఆదివారం పలుచోట్ల చిరుజల్లులకు అవకాశం
మున్ముందు భగభగే..
గత నెల నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 13 వడగాడ్పు రోజులు నమోదయ్యాయి. మున్ముందు దాదాపు 20 వడగాడ్పు రోజులు ఉండనున్నాయి. గతంలో ఎన్నడూ ఇన్ని వడగాడ్పు రోజులు వచ్చిన పరిస్థితి లేదు.
13 రెడ్ అలర్ట్లు...
ఈ సీజన్లో ఇప్పటివరకు 13 రెడ్ అలర్ట్లు నమోదైనట్లు నిపుణులు అంటు న్నారు. ఈ నెల రాష్ట్రంలో కొన్నిచోట్ల 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తుంది.
అలర్ట్ జారీ ఇలా..
సాధారణం కంటే ఆరు డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్ అలర్ట్, నాలుగైదు డిగ్రీల వరకు అధికమైతే ఆరెంజ్, సాధారణం కంటే కొద్దిగా ఎక్కువైతే ఎల్లో, సాధారణం కంటే తక్కువైతే వైట్ అలర్ట్ జారీ చేస్తారు.
(చదవండి: ఆంధ్రప్రదేశ్.. నిప్పుల గుండం)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విజృంభిస్తున్న వడగాడ్పులకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. పదుల సంఖ్యలో జనం చనిపోతున్నట్లు అంచనాలున్నా.. కలెక్టర్ల నుంచి ఇప్పటివరకు వడదెబ్బ మృతులకు సంబంధించి తమకు ఎటువంటి నివేదిక రాలేదని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. మే రెండో వారం ప్రారంభం నుంచే.. ఎండల పరిస్థితి రోజురోజుకూ మరింత తీవ్రంగా మారుతోంది. ఈ పరిస్థితి రోహిణీ కార్తె వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఉత్తరాది నుంచి వేడిగాలులు రాష్ట్రంపై పంజా విసురుతున్నాయి. దీంతో గాలిలో తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గతేడాది ఎండాకాలంలో మధ్యమధ్యలో కాస్తంత ఉపశమనం కలిగించేలా వర్షాలు వచ్చేవి.
కానీ ఈ నెల నాలుగో తేదీ నుంచి ఎక్కడా వర్షపు జాడలే లేవు. నిరంతరాయంగా వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం విలవిల్లాడుతున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే గత నెల నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 13 రోజులు వడగాడ్పులు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మున్ముందు ఇంకా 15 నుంచి 20 వడగాడ్పు రోజులు ఉంటాయని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు హెచ్చరించారు. అంటే మొత్తంగా ఈ ఎండాకాలం సీజన్లో 30 రోజులకుపైగా వడగాడ్పుల రోజులు నమోదయ్యే పరిస్థితి కనిపి స్తుంది. గతంలో ఎన్నడూ ఇన్ని రోజులపాటు వడగాడ్పులు వచ్చిన పరిస్థితి లేదు. 2017లో అత్యధికంగా 27 వడగాడ్పుల రోజులు నమోదు కాగా, ఈసారి ఆ రికార్డును ఈ ఎండాకాల సీజన్ బద్దలు కొట్టే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యలో ఊరటనిచ్చేలా ఏమైనా వర్షాలుంటే సరేసరి.. లేకుంటే ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
వాతావరణ కేంద్రం అలర్ట్
ఎండల తీవ్రతను బట్టి వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. సాధారణం కంటే ఆరు డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదైతే అత్యంత తీవ్రమైన ఎండగా గుర్తించి రెడ్ అలర్ట్ జారీచేస్తారు. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే అప్పుడు ఎండల తీవ్రతగా గుర్తించి ఆరెంజ్ అలర్ట్ జారీచేస్తారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కొద్దిగా ఎక్కువగా నమోదైతే వేడి రోజుగా గుర్తించి ఎల్లో (హీట్వేవ్ వార్నింగ్) ఇస్తారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే వైట్ అలర్ట్ జారీచేస్తారు. తీవ్రమైన వడగాడ్పులు నమోదైతే రెడ్ అలర్ట్ ఉంటుంది. ఆ ప్రకారం ఈ సీజన్లో ఇప్పటివరకు 13 రెడ్ అలర్ట్లు నమోదైనట్లు నిపుణులు అంటున్నారు.
తెలంగాణలో ఈ ఏడాది సాధారణం కంటే 0.5 డిగ్రీల నుంచి 1 డిగ్రీ వరకు అధికంగా ఉంటాయని వాతావరణ కేంద్రం వేసవి ఆరంభంలోనే హెచ్చరించింది. రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెలంగాణపైకి వడగాడ్పులు వీస్తున్నాయి. అంతేకాదు దేశంలో వడగాడ్పులు అధికంగా వచ్చే డేంజర్ జోన్లో తెలంగాణ ఉండటంతో ఈసారి భగభగలాడుతోంది. ఈ నెల రాష్ట్రంలో కొన్నిచోట్ల 47 నుంచి 49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తూ వస్తోంది. ఆదిలాబాద్, భద్రాచలం వంటి చోట్లనైతే 48–49 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్లో ఈసారి 45–47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే ప్రమాదం ఉంది.
ఎండదెబ్బకు గురికాకుండా..
ఎండ తీవ్రత బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రజలకు సూచించింది. ఆ మేరకు ఒక కరపత్రాన్ని విడుదల చేసింది.
వడదెబ్బ లక్షణాలు...
తలనొప్పి, తలతిరగడం, తీవ్రమైన జ్వరం కలిగి ఉండటం, చర్మం పొడిబారటం, మత్తు నిద్ర, వాంతులు, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి.
నేడు వడగాడ్పులు
ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో శనివారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆదివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల (గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో)తో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. ఇదిలావుండగా శుక్రవారం ఖమ్మం, నల్లగొండ, రామగుండంలలో 45 డిగ్రీల చొప్పు న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, భద్రాచలం, మహబూబ్నగర్లలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో 42 డిగ్రీలు రికార్డు అయింది.
వడగాడ్పులుంటే...
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడనివి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు...