కుక్కకాటుపై సుమోటో కేసు..

11 Aug, 2014 00:35 IST|Sakshi
కుక్కకాటుపై సుమోటో కేసు..

సాక్షి, సిటీబ్యూరో: మల్కాజిగిరికి చెందిన సుదర్శన్ అనే రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి ఘటనపై  రాష్ట్ర బాలల హక్కుల  కమిషన్ తీవ్రంగా స్పందించింది. బాలల హక్కుల కమిషన్ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.  గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఊరకుక్కలు స్వైర విహారం చేస్తూ అనేక మందిని కరవడమే కాకుండా పసిపిల్లల ప్రాణాలు బలిగొంటున్న విషయాన్ని సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని రాష్ట్ర బాలల హక్కుల  కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది.

వీధి కుక్కలను అరికట్టి పిల్లల ప్రాణాలు ఎందుకు కాపాడలేక పోతున్నారో, ఎక్కడ తప్పిదం జరుగుతుందో, ఇందుకు బాధ్యులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఆగస్టు 25లోగా పూర్తి నివేదిక సమర్పించాలని కమిషన్ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసిందని కమిషన్ సభ్యులు అచ్యుత్‌రావు, డాక్టర్ మమత రఘువీర్, రహిముద్దీన్ త్రిసభ్య కమిషన్ పేర్కొంది.

విధినిర్వహణలో అలసత్వం చూపించిన అధికారులు, ఉద్యోగులపై ఇంత వరకు ఎలాంటి చర్యలు చేప్పటకపోతే నిబంధనల ప్రకారం వారిపై చర్యలు చేపట్టాలని కమిషన్ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు